నీ తండ్రి ముస్లిం.. తల్లి క్రిస్టియన్
నువ్వు మాత్రం బ్రాహ్మణుడివా..?
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన వైమానిక దాడులకు సాక్ష్యాలు కావాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. దాంతో కేంద్రమంత్రి అనంత్ హెగ్డే నేరుగా రాహుల్ గాంధీ మీదే విమర్శలకు దిగారు. అసలు దాడులకు సాక్ష్యం కావాలని రాహుల్ ఎలా అడుగుతారన్నారు. ‘‘ప్రపంచమంతా గుర్తించినా వాళ్లకు మాత్రం సర్జికల్ దాడులకు సాక్ష్యాలు కావాలట’’ అని అన్నారు.
ముస్లిం తండ్రి.. క్రిస్టియన్ తల్లి..
‘‘అసలు ముస్లిం తండ్రికి, క్రిస్టియన్ తల్లికి పుట్టిన ఆయనకు హిందువు అని చెప్పుకోడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? ముస్లిం అయి ఉండి, తనను తాను జంధ్యం వేసుకునే బ్రాహ్మడినని చెప్పుకొంటారు’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో అనంత హెగ్డేకు గట్టి పేరే ఉంది. పార్లమెంటులో అలా మాట్లాడవద్దని అనంత హెగ్డేను హెచ్చరించినట్లు ఆయన పార్టీ సహచరుడు యడ్యూరప్ప బహిరంగంగానే చెప్పారు.
ఆలయాలకు వెళ్లినప్పటి నుంచే..
రాహుల్ గాంధీ కులం, మతం గురించి బీజేపీ నేతలు ఎప్పటినుంచో ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తరచు శివాలయాలకు వెళ్లి వస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తాయి. రాహుల్ జంధ్యం ధరించే బ్రాహ్మణుడని కాంగ్రెస్ వర్గాలు చెబుతుండటంతో బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. తాను, తన కుటుంబ సభ్యులు శివభక్తులమని రాహుల్ చెప్పేవారు. అయితే అది వ్యక్తిగత విషయం కాబట్టి దానిపై చర్చించడం ఇష్టం లేదన్నారు.
ఆ ఫోన్లను చెట్లు వాడాయా?
బాలాకోట్ జైషే మహ్మద్ స్థావరంపై వైమానికదళ దాడుల్లో ఎందరు ఉగ్రవాదులు మరణించారని వివాదం వచ్చింది. దానిపై ప్రతిపక్ష పార్టీలు తరచు ప్రశ్నించడంతో కాంగ్రెస్ – బీజేపీ మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ప్రభుత్వం చెప్పే లెక్కకు, బీజేపీ నేతల లెక్కు పొంతన కనపడలేదు. చాలామంది ఉగ్రవాదులు మరణించారని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. కానీ బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం 250 అని అన్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ అయితే దాదాపు 300 మంది చనిపోయారన్నారు. ఐఏఎఫ్ దాడులకు ముందు 300 మొబైల్ ఫోన్లు అక్కడ పనిచేశాయని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పింది. వాటన్నింటినీ చెట్లు ఏమైనా వాడుతున్నాయా అని రాజ్ నాథ్ ప్రశ్నించారు.