కాకినాడ సమర శంఖారావం సభలో వైఎస్ జగన్. ఈ సభలోనే ఆయన పవన్పై తీవ్ర విమర్శలు చేశారు. photo credit: ysrcp
ఎన్నికల షెడ్యూలు విడుదలయిన తర్వాత కూడా వైసిపి, జనసేన మధ్య ఎన్నికల పొత్తు కుదురుతుందా అన్న విషయంలో ఊహాగానాలు ఆగడం లేదు. షెడ్యూలు విడుదల కాగానే రెండు లోక్సభ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించి మిగతా పార్టీల కన్నా ముందు నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటినుంచీ మిత్రులుగా ఉన్న ఉభయ కమ్యునిస్టు పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు నడుపుతున్నారు.
సోమవారం కాకినాడలో సమర శంఖారావం సభలో మాట్లాడిన వైసిపి అధినేత వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని హత్య చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తర్వాత ఇంకా పొత్తు సంభవమా అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం జనసేనతో పొత్తుకోసం వైసిపి నుంచి చివరి ప్రయత్నం జరిగిన మాట నిజమే. వైసిపి క్యాంపులో గెలుపుపై ఎంత విశ్వాసం ఉన్నా ఆఖరి నిముషంలో చంద్రబాబు మాజిక్ చేస్తారన్న భయం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. అందుకే పకడ్బందీగా రంగంలోకి దిగాలనీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఇక విజయానికి ఢోకా ఉండదనీ కొందరు నాయకులు వాదించారు. దీనిపై అంతగా ఆసక్తి లేని జగన్ చివరికి తలొగ్గి కాపు కులానికి చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను రంగంలోకి దించినట్లు తెలిసింది.
అయితే ఇటు జగన్ ఎలా నిరాసక్తంగా ఉన్నారో అటు పవన్ కళ్యాణ్ కూడా అంతే నిరాసక్తంగా ఉన్న కారణంగా ఈ ప్రయత్నం పెద్దగా ముందుకు సాగలేదని సమాచారం. ఈ పరిణామం తర్వాతనే కాకినాడ సభలో జగన్ విమర్శలకు పదును పెంచినట్లు కనబడుతోంది. నిజానికి పవన్తో పొత్తు కోసం పార్టీలో ఎందరు సానుకూలంగా ఉన్నా జగన్కు ముందు నుంచీ అంత ఆసక్తి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పవన్ వైవాహిక జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఇందుకు తార్కాణంగా చూపుతున్నారు.
ఆ వ్యాఖ్యలకు చాలా నొచ్చుకున్న పవన్ ఆ కారణంగానే వైసిపితో పొత్తుకు మానసికంగా దూరం అయ్యారని జనసేన వర్గాలు అంటున్నాయి. నిజానికి జనసేనలో వైసిపితో పొత్తు పెట్టుకోవాలని వాదించే వర్గం బలంగా ఉంది. తమ సొంత బలంతో పోటీకి దిగడం కన్నా వైసిపితో పొత్తుతో దిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వారి నమ్మకం. అయితే ఇటీవలే పార్టీలో చేరి పవన్కు దగ్గరయిన నాదెండ్ల మనోహర్, అధినేత అంతరంగం ఎరిగి తానూ పొత్తును వ్యతిరేకించినట్లు సమాచారం. ఏదైతేనేం చివరికి రెండు పార్టీల అధినేతల మాటే చెల్లుబాటయినట్లు కనబడుతోంది.