ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండవ రోజే నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ఈ అత్యంత వేగవంతమైన రైలు తిరుగు ప్రయాణంలో దేశ రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది.
ట్రెయిన్ 18గా కూడా పిలిచే ఈ రైలు నిన్న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచింది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. రైలు నియంత్రణ వ్యవస్థలో లోపం తలెత్తిందనీ, దీనిని ఢిల్లీలోనే సరి చేయగలమనీ రైల్వే వర్గాలు తెలిపాయి. మూడున్నర గంటలు ఆగిన తర్వాత రైలు తిరిగి ఢిల్లీ బయలుదేరింది. అయితే లోపం సరిచేసేవరకూ రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించి నడవదు.
సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయిన తర్వాత అందులోని ప్రయాణీకులను వేరే రెండు రైళ్లలో సర్ది పంపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో లోపం తలెత్తడానికి కారణం రైలు కింద ఏ పశువో పడిఉండడం కావచ్చని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రావాల్సి ఉంది.
నియంత్రణ వ్యవస్థ విఫలం కావడం వల్ల రైలులోని కొన్ని బోగీలలో ఉదయం అయిదు గంటలకు ఎసి పనిచేయడం ఆగిపోయింది. దానికి తోడు బోగీలలో నీరు కూడా లేకపోయింది. బ్రేకుల వ్యవస్థ పని చేయకపోవడంతో చామ్రోలా స్టేషన్లో ఆపే ముందు రైలును గంటకు పది కిలోమీటర్ల వేగంతో నడిపారు.
ఇంజిన్ లేని ఈ రైలును పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు. ప్రారంభించే ముందు అన్ని రకాల పరీక్షలూ పూర్తి చేశారు. ప్రారంభ ప్రయాణం ముందు ఈ రైలు ఏడు వేల కిలోమీటర్ల దూరం తిరిగింది.