అమరావతి: పూర్తి ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్ ఆ విషయంలో స్పష్టత ఇచ్చారు. శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ సూచించినట్లుగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టుల కేటాయింపులపై, ఇతర అవినీతి ఆరోపణలపై దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ అవినీతి పరిశీలనకు సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయవిచారణ సంఘాన్ని నియమిస్తామని ఆయన చెప్పారు. రేపో ఎల్లుండో ప్రధాన న్యాయమూర్తిని కలిసి న్యాయవిచారణ కమిషన్ కోసం ఒక సిట్టింగ్ జడ్జిని కేటాయించాల్సిందిగా కోరతామని చెప్పారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వచ్ఛమైన అవినీతి రహిత పాలన అందిస్తామని జగన్ పేర్కొన్నారు. న్యాయవిచారణలో అవినీతి జరిగిందని తేలిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత రద్దయిన కాంట్రాక్టుల పనులకు న్యాయవిచారణ సంఘం సూచించిన తీరులో రివర్స్ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టులు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఆ పద్ధతిలో ప్రభుత్వానికి ఎంత డబ్బు ఆదా అయిందో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.