అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం
అమరావతి: విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి చేరుకోనున్నారు. తమ పార్టీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వసిస్తున్న వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా కౌంటింగ్ వద్ద నిర్లక్ష్యంగా ఉండడం ఏమాత్రం మంచిది కాదని ఆయన తన పార్టీ నాయకులతో అన్నారు.ఎంత ఆధిక్యంలో ఉన్నా చివరివరకూ కౌంటింగ్ కేంద్రం వదిలివెళ్లరాదని అభ్యర్ధులందరికీ సమాచారం పంపించారు. విజయం సాధించిన అభ్యర్ధులందరూ అమరావతి చేరుకోవాలని కూడా చెప్పారు. 25వ తేదీన లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహిద్దామని ఆయన తన స్ననిహితులతో అన్నట్లు తెలిసింది.
గురువారం రాష్ట్రంలో లోక్సభ స్థానాలకూ, అసెంబ్లీ స్థానాలకూ వోట్ల లెక్కింపు జరగనున్నది. గురువారం ఉదయం జగన్ ప్రత్యేక విమానంలో బయలుదేరి పులివెందుల వెళతారు. అక్కడ తన తాత రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వెంటనే అమరావతి తిరిగివస్తారు. అమరావతిలో తాను ఇటీవల గృహప్రవేశం చేసిన క్యాంప్ ఆఫీస్లో కూర్చుని కౌంటింగ్ కేంద్రాల నుంచి వచ్చే ఫలితాల సమాచారాన్నిసమీక్షిస్తారు.
వైఎస్ జగన్ సతీమణి భారతి 18వ తేదీనే అమరావతిలోని స్వగృహానికి చేరుకున్నారు. ఇంటిని తన అబిరుచుకి అనుగుణంగా తీర్చిదిద్దడం, జగన్ అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయడం వంటి కార్యక్రమాలను ఆమె చూస్తున్నారు.