సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే ముందు అందరికీ ప్రాణ భయం పట్టుకుంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు కరోనా వైరస్ సోకినా కూడా తన ప్రాణాల కన్నా ఆస్పత్రిలో అయ్యే ఖర్చు గురించి ఎక్కువగా భయపడుతున్నారు. ఇప్పటికే 60 శాతం రికవరీ రేటును రెండు తెలుగు రాష్ట్రాలు సాధించాయి. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం వారం రోజులకే లక్షలకు లక్షలు బిల్లు వేసి జనాలను బెదరగొడుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో మనం అనేక ఆస్పత్రులలో చూడగా ఏపీలో మాత్రం అందుకు ఆస్కారం లేకుండా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మొదటి నుండి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న జగన్ సర్కార్ పేదవాడికి ముఖ్యమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో మార్పులు చేసింది. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 జబ్బులకే చికిత్స అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి వ్యాధులను చేర్చింది. వాటిలో కరోనా చికిత్సను కూడా తాజాగా తాము చేరుస్తున్నామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం నేడు ఈ పథకాన్ని ఆరు జిల్లాల్లో అమలు చేయనుంది. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో ‘ఆరోగ్యశ్రీ’ నేడు అమలులోకి రానుంది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుండి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆరోగ్యశ్రీ లో కొన్ని సంచలనాత్మక మార్పులు చేశారు. ఈ ఏడాది జనవరిలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు ఈ సేవలను విస్తరించారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే పథకం వర్తింప చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు అమలు సమయంలో గుర్తించిన అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేశారు.. విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.