నిప్పును చల్లార్చేది నీరు. కానీ అక్కడ నిప్పు, నీరు రెండు కలిసిపోయాయి. అది కూడా కుళాయి పైపులో..! ఇంకేముంది నీటికి బదులుగా నిప్పును విరజిమ్ముతూ.. మంటలు ఎగిసిపడుతున్నాయి. మీరు చదివింది నిజమే.. నీరు రావాల్సిన దారి నుంచి మంటలు వస్తున్నాయి. ఎదో ఒకరోజే అనుకుంటే పొరబాటే.. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇలా జరుగుతోంది. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
వివరాల్లోకెళ్తే.. తూర్పు చైనాలోని లియోనింగ్ ప్రావీన్స్ లో ఉన్న పాంజిన్ నగరంలో ఈ వింత, ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కుళాయి నుంచి నీటితో పాటు మంటలు కూడా వస్తున్నాయి. దీని గురించి ఈ ఘటన జరిగిన ఇంటి మహిళ… అక్కడి అధికారులకు కుళాయి నుంచి వస్తున్న మంటలపై ఫిర్యాదు చేసింది. అయితే, అక్కడి అధికారులు దీనిని నమ్మకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఇక ఈ సమస్య పరిష్కారం కావాలంటే.. అధారాలు కూడా చూపించాలి అనుకున్న స్థానిక మహిళ వెన్.. కుళాయి నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్న వీడియోను షోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే, దీనిని గురించి పలు వ్యాఖ్యలు రాసుకొచ్చింది. దాని ప్రకారం.. ఇంట్లో ఉన్న స్నానాల గది, వంట గది, సింక్ లోని కుళాయి పైపు నుంచి ఒక్కసారిగా నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్నాయని తెలిపింది. ఇదేదో రెండు మూడు రోజుల నుంచి ఉన్న సమస్య కాదనీ, గత మూడునాలుగేళ్ల నుంచి ఇలానే జరుగుతోందని తెలిపారు.
ఈ ప్రాంతంలో వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరందరూ ఈ సమస్యను ఎదుర్కొటున్నారని విన్ తెలిపింది. దీనిపై అనేక సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కుళాయి నుంచి మంటలు రావడం వల్ల అనుకోని ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని కోరింది. వీడియో చూసిన అధికారులు వెంటనే దీనిపై దర్యాప్తును మొదలు పెట్టారు. అండర్గ్రౌండ్ వాటర్ సిస్టమ్లోకి గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.