చంద్రబాబు మాటకు విలువెంత? రాజీనామా చేసేదెవరు? అమరావతి కోసం చంద్రబాబు మాట వినేదెవరు?
అమరావతి రాజధాని మార్పు వ్యవహారం ఇప్పుడు టీడీపీలో పొగలు… సెగలు కక్కిస్తోంది. రాజధాని విషయంలో క్లియర్ కట్ అప్రోచ్ తో వెళ్లాలనుకుంటున్న టీడీపీ బాస్ చంద్రబాబునాయుడికి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా పరిస్థితులు మారిపోతున్నాయ్. చచ్చీచెడీ 23 స్థానాలకు పరిమితమైన టీడీపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. అఫీషియల్గా చేరకున్నా… గన్నవరం ఎమ్మెల్యే వంశీ, చీరాల ఎమ్మెల్యే బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సీఎం జనగ్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. వారే కాకుండా ఇంకా కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు అమరావతి కోసం ఉద్యమబాటను టీడీపీ అధినాయకత్వం ప్రిపేర్ చేస్తోంది. రాజధాని అమరావతి తన కలల సౌధమని… ప్రాజెక్టును అటకెక్కించడం దారుణంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కారాలు… మిరాయాలు నూరుతున్నారు. మొత్తంగా రాజధాని అంశాన్ని మోతమోగించి పార్టీకి పూర్వవైభవం తేవాలని నారా వారు ఏమ స్కెచ్ వేస్తున్నారు. ఏంటా స్కెచ్… ఆ లెక్కలేంటనుకుంటున్నారా… అవును రాజీనామా అస్త్రం… టీడీపీ అమ్ములపొదిలో ఇప్పుడు రాజీనామా అస్త్రం బయటకు రాబోతోంది. జగన్మోహన్ రెడ్డిని ఇరుకునపెట్టేందుకు ఈ ఆయుధాన్ని చంద్రబాబు బయటకు తీస్తున్నారు.
రాయలసీమలో టీడీపీ గెలిచింది కేవలం మూడు సీట్లే. ఒకటి చంద్రబాబు, రెండు బాలయ్య, మూడు పయ్యావుల కేశవ్. బావ, బామ్మర్దులు రిజైన్ చేసి గెలిచే స్కోప్ ఉంది. కానీ పయ్యావుల అక్కడ రాజీనామా చేస్తే గెలవడం అసాధ్యం. సో… పయ్యావుల రాజీనామా మాటకు అసలు స్పందించే అవకాశం లేదు. ఇక ప్రకాశం జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే టీడీపీకి దూరం జరిగారు. మరొక ఎమ్మెల్యే జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. కొండెపి ఎమ్మెల్యే అడుగులు సైతం అయోమయంగా కన్పిస్తున్నాయ్. పర్చూరు ఎమ్మెల్యే రాజధానికి సమీపంలోనే ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, గెలవడం అన్నది కొంచెం కష్టమే. కొండెపి, అద్దంకి ఎమ్మెల్యేలు దాదాపు రాజీనామా చేయడం కష్టమే.
గుంటూరులో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే పార్టీ ఫిరాయించేశారు. మరో ఎమ్మెల్యే కూడా త్వరలో పార్టీ మారడం ఖాయమని… అందుకు ఫ్యామిలీ ఈక్వేషన్లు కూడా ఉన్నాయంటున్నారు. సో… గుంటూరు జిల్లా నుంచి ఒక్కరు కూడా రాజీనామా చేయరు. ఇక కృష్ణా జిల్లాలో గెలిచిన ఇద్దరిలో ఒకరు మాత్రమే మిగిలారు. విజయవాడ తూర్పులో ఎన్నిక జరిగితే టీడీపీ ఎంత మాత్రం గెలుస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో గెలిచిన రెండు స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ… రామానాయుడు, రామరాజు ఏమేరకు రాజీనామాలకు సై అంటారన్నదానిపై క్లారిటీ లేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో గెలిచిన నాలుగు స్థానాల్లో రాజమండ్రి నుంచి రెండు సీట్లు, మండపేట, పెద్దాపురం సీట్లలో టీడీపీ విజయం సాధించింది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో బీసీ, ఎస్సీ రాజకీయం జోరందుకుంటున్న దరిమిలా… ఈసారి నలుగురు ఎమ్మెల్యేల్లో రాజీనామాలు చేసేందుకు ముందుకొచ్చేదెవరున్న సందిగ్ధత నెలకొంది.
విశాఖ రాజధాని కావడంతో జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఏ స్టాండ్ తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ ఉంది. గంటా బ్యాచ్ లోని ముగ్గురు ఈనెల 9న వైసీపీ తీర్థం పుచ్చుకోనుండటంతో, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే సైతం వైసీపీ గూటికి చేరే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే గతంలో ఆయనపై విమర్శలతో వైసీపీ హైకమాండ్ అందుకు ఎస్ చెబుతుందా అన్న సందేహం ఉంది. ఇక శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి గెలిచిన అశోక్ సైతం ఊగిసలాటలో ఉన్నారంటున్నారు. మరో ఎమ్మెల్యే అచ్చెన్న ఇప్పటికే జైల్లో ఉన్నారు.
మొత్తంగా రాజీనామా చేసేదెవరు… గెలిచేదెవరన్న లెక్కలు క్లిష్టర్ క్లియర్ గా కన్పిస్తున్నాయ్. బాలయ్య, చంద్రబాబు కన్ఫామ్ గా చేస్తారు. ఇక పయ్యావుల డౌట్. ఇక ప్రకాశంలో రాజీనామా చేసేందుకు ముందుకొచ్చేది ఎవరన్నది అనుమానమే. ఇక విజయవాడ తూర్పు నుంచి ఎన్నికైన గద్దే రామ్మోహన్ రావు రాజీనామాకు ఓకే చెప్పొచ్చు. ఇక పశ్చిమలో రామానాయుడు, రామరాజు సై అనొచ్చు. ఇక రాజమండ్రి విషయంలోనూ కొంత యాంబిగ్విటీ ఉంది. అక్కడ రాజీనామా చేసి గెలవడం నలుగురు ఎమ్మెల్యేలకు ప్రాణసంకటమే. గెలవడం నలుగురికీ కష్టమే. ఇక విశాఖలో ఎన్నికల అవకాశం లేదు. శ్రీకాకుళంలో అచ్చెన్న రాజీనామా చేస్తే… ఇప్పటికే అవినీతి ఆరోపణలు.. ఆపై మరోసారి ఎన్నికల్లో గెలవడం అంత వీజీ కాదన్న అభిప్రాయం ఉంది.