అమరావతి, మార్చి 13: హడావుడిగా వచ్చిపడిన ఎన్నికలలో అభ్యర్దుల ఖరారే ఇంకా పూర్తి కాని నేపధ్యంలో అటు అధికారపక్షమైన టిడిపి ఇటు ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ప్రచారం ప్రణాళికలు రచించుకుంటున్నాయి. రెండు పార్టాల అధినేతలూ ఒకే రాజు ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీ తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధివద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని (బస్సు యాత్ర ) ప్రారంభించనున్నారు.
టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుపుతున్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు.
జాబితాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఖరారు అయిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు చేసుకునేందుకు ఇప్పటికే ఆయా పార్టీల అధినేతల నుండి గ్రీన్ సిగ్నల్ వెలువడటంతో పలు నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14 పార్టీ రాజమండ్రిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని 16వ తేదీ తిరుపతి నుండి ప్రారంభించాలని భావించినా అదే రోజు టిడిపి ప్రచారం ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో 18వ తేదీకి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి రోజుకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ముగ్గురు నేతలు రాయలసీమ ప్రాంతాల నుండే ఎన్నిక ప్రచారాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం.
ఎన్నికల ప్రచార పర్వానికి కేవలం మూడు వారాలు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అధినేతలు అన్ని జిల్లాలను కవర్ చేసేందుకు హెలికాఫ్టర్లను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 18వ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల, అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు.