ఢిల్లీ: ప్రధాని మోది ‘మిషన్ శక్తి’ పై చేసిన ప్రసంగానికి ఎన్నికల కమిషన్(ఈసి) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన చేసిన ప్రసంగంలో ఎలాంటి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగలేదని ఈసి పేర్కొంది.
భారత్ అభివృద్ధి చేసిన యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా మోది రెండు రోజుల క్రితం జాతినుద్దేశించి ప్రసంగించారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి.
ఇదేమీ దేశభద్రతకు సంబంధించిన అంశంకాదనీ, కానీ ప్రధాని పనిగట్టుకుని అదేదో తమ ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చారని విపక్షాలు పేర్కొన్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అంటూ ఈసికి ఫిర్యాదు చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగాన్ని పరిశీలించేందుకు డిప్యూటి ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో ఒక ప్యానల్ను ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ఏర్పాటు చేసింది.
ప్యానల్ ప్రాథమిక విచారణ ప్రకారం మోది ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని తేలినట్టు ఈసి తెలిపింది. తన పార్టీ (బిజెపి) పేరును కానీ, తనకు అనుకూలంగా ఓటు వేయాలని కానీ ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని ఈసి పేర్కొంది.