బాలీవుడ్ తాజా జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొనే కాషాయ కండువాలు వేసుకుని, వాటి మీద ‘బీజేపీకి, మోదీకి ఓట్లు వేయండి’ అని ప్రచారం చేస్తున్నట్లు ఓ ఫొటో ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఫేస్ బుక్ లోని ఒక పేజీలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. దాంతోపాటు.. ‘‘కమలం గుర్తు పక్కన ఉండే బటన్ నొక్కండి, దేశ ప్రగతిలో భాగస్వాములు కండి’’ అనే కేప్షన్ కూడా పెట్టారు.
https://www.facebook.com/bihar05/photos/a.318242902317997/447508359391450/?type=3
ఏక్ బిహారీ 100 పే భారీ అనే పేజీలో దీన్ని పోస్ట్ చేశారు. ఈ పేజీకి మహా అయితే 36 వేల మంది ఫాలోవర్లున్నారు. ఈ పోస్టును 4వేల మంది ఇప్పటికే షేర్ చేశారు. మై భీ చౌకీదార్ అనే పేజీలో కూడా దీన్ని పోస్ట్ చేశారు. మరో వ్యక్తి తన పేజీలో దీన్ని పోస్ట్ చేయగా, 2600 వరకు షేర్లు వచ్చాయి.
అంతా ఫొటోషాప్ మాయ
అయితే, ఇప్పటివరకు అన్ని సందర్భాలలో జరుగుతున్నట్లే ఇందులోనూ నిజం లేదు. ‘ఆల్ట్ న్యూస్’ దీన్ని గూగుల్ ద్వారా రివర్స్ సెర్చ్ చేసినపుడు అసలు ఫొటో కూడా దొరికేసింది. అది 2018 నవంబరు 30న తీసింది. కొత్త దంపతులు దీపికా, రణవీర్ ఇద్దరూ ముంబైలోని సిద్ది వినాయక ఆలయానికి వెళ్లారు. అక్కడ సాధారణ కాషాయ కండువాలు వేసుకున్నారు. అప్పుడు వారిని ఫొటో తీయగా, దాన్ని పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ కండువాల మీద ఫొటోషాప్ ద్వారా తమకు కావల్సినవి రాసుకుని పోస్ట్ చేయడం తాజా విశేషం.