ఇండోనేసియాలో బ్యాలట్ పత్రాలతో ఎన్నికలు
జకార్తా: ఇండోనేసియాలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు.. సిబ్బంది ప్రాణాల మీదకు వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు బ్యాలట్ పేపర్లను లెక్కించాల్సి రావడం, తీవ్రంగా ఉక్కపోత పరిస్థితులు ఉండటంతో అక్కడ ఇప్పటివరకు 272 మంది సిబ్బంది మరణించగా, మరో 1878 మంది అస్వస్థులయ్యారు. ఈ విషయాన్ని ఇండోనేసియా జనరల్ ఎలక్షన్స్ కమిషన్ (కేపీయు) అధికార ప్రతినిధి వెల్లడించారు. వందలాది దీవులు.. 19.3 కోట్ల మంది ఓటర్లు.. 80 శాతం పోలింగ్.. అలా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. కానీ ఓట్ల లెక్కింపు కొందరి ప్రాణాలు బలితీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంతో.. ఒక్కో ఓటరు 5 ఓట్లు వేయాల్సి వచ్చింది. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరగడంతో ఓట్ల లెక్కింపు కష్టతరంగా మారింది. 19.3 కోట్ల మంది ఓటర్లలో 80 శాతం అంటే 15.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా వేసిన 77.5 కోట్ల బ్యాలట్ పేపర్లను సిబ్బంది లెక్కించాల్సి వచ్చింది. ఇందుకోసం దాదాపు 70 లక్షల మంది కౌంటింగ్, పర్యవేక్షణ సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ఇండోనేసియా అధికారులు తీసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల విధానం అమలులో ఉన్న ఇండోనేసియాలో ఈ నెల 17న దేశాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు జాతీయ, ప్రాంతీయ చట్టసభలు, స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక విడతలో అన్నిరకాల ఎన్నికలకు వెళ్లారు. కానీ బ్యాలట్ పేపర్లన్నింటినీ పార్టీల వారీగా వేరు చేసి, కట్టలు కట్టి వాటిని లెక్కపెట్టడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. సరైన వసతులు లేకపోవడం, ఎక్కువ సేపు పనిచేయాల్సి రావడంతో ఒత్తిడి అధికమై వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఎన్నికలు నిర్వహిస్తున్న జనరల్ ఎలక్షన్స్ కమిషన్పై, ఒకే విడతలో అయిదు ఎన్నికలకు అనుమతించిన ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల కుటుంబాలకు కనీస వేతన చట్టం కింద వచ్చే వేతనంలో ఏడాది జీతం లెక్కించి సుమారు రూ. 1.75 లక్షలు (భారతీయ కరెన్సీలో) ఇవ్వాలని అక్కడి ఆర్థిక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.