దిగ్విజయ సింగ్ వివాదాస్పద ప్రకటన
మండిపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్య బీజేపీతో పాటు ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలకు తావిచ్చింది. బిహార్ లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి, విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ తన తరఫున ప్రచారం చేస్తాడని దిగ్విజయ అన్నారు. తాను కన్నయ్యకు మద్దతిస్తానని, ఆ విసయం బహిరంగంగా చెబుతానని ఆయన తెలిపారు. మే 8, 9 తేదీలలో అతడు భోపాల్ వచ్చి తన తరఫున ప్రచారం చేస్తాడని చెప్పేందుకు సంతోషిస్తున్నానన్నారు. కన్నయ్య లాంటివాళ్లు మతతత్వంపై గళమెత్తుతున్నందుకు వాళ్లను ప్రశంసించాలని చెప్పారు. అతడు, అతడి స్నేహితులు ‘టుకడే టుకడే’ వ్యాఖ్యలు చేయలేదని, ఒక టీవీ చానల్ అనవసరంగా తప్పుడు ప్రచారం చేసి వివాదం రేకెత్తించిందని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. తన ప్రచారానికి టుకడే టుకడే గ్యాంగ్ సభ్యుడు కన్నయ్యను దిగ్విజయ పిలుస్తారెందుకని బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతినే పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. దీంతోనే దిగ్విజయ అసలు రంగు బయటపడిందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ వర్గాలు కూడా దిగ్విజయ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఒకవైపు తమకు ప్రత్యర్థిగా ఉన్న సీపీఐ అభ్యర్థిని ఆయన తనవైపు ప్రచారానికి ఎలా పిలుస్తారని కొందరు నేతలు ప్రశ్నించారు. పైపెచ్చు బెగుసరాయ్ లో కాంగ్రెస్ టికెట్ అతడికే ఇవ్వాల్సిందని ఈయనెలా చెబుతారంటున్నారు. సొంతంగా గెలవలేనప్పుడు పోటీకి దిగడం ఎందుకని ముఖ్యమంత్రి కమల్ నాథ్ వర్గానికి చెందిన కొందరు నేతలు దిగ్విజయ సింగ్ మీద మండిపడుతున్నారు.