అమరావతి, ఏప్రిల్ 29: సినీదర్శకుడు రాంగోపాల్ వర్మను విజయవాడలో పోలీసులు అడ్డుకోవడంపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా, వివాదాస్పదంగా మారింది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపోల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టిఆర్ బయోపిక్ మే ఒకటవ తేదీన విడుదల చేయనున్న నేపధ్యంలో ఆ చిత్రానికి సంబంధించిన విషయాలను తెలియజేసేందుకు ఆదివారం వర్మ విజయవాడ మీడియా సమావేశం నిర్వహించాలని భావించారు. అయితే రాంగోపాల్ వర్మ బుక్ చేసుకున్న హోటల్ యాజమాన్యం ప్రెస్ మీట్కు అనుమతి తీసుకోనందున ఆయన బుకింగ్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టిఆర్ సర్కిల్ వద్ద రోడ్డుపైనే మీడియా సమావేశం నిర్వహించనున్నానంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రాంగోపాల్ వర్మ రోడ్డుపై మీడియా సమావేశం నిర్వహిస్తే శాంతి భద్రతల సమస్య, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయనీ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసులు ఆయన్ను మీడియా సమావేశం నిర్వహించడానికి అనుమతించేది లేదంటూ అదుపులోకి తీసుకుని గన్నవరం ఎయిర్పోర్టుకు బలవంతంగా తీసుకువెళ్లి రిటర్న్ ఫ్లైట్ ఎక్కించి పంపించి వేశారు.
ఇదిలా ఉండగా వైసిపి అధినేత జగన్నోహనరెడ్డి రాంగోపాల్ వర్మకు విజయవాడలో జరిగిన అనుభవంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ.. ! ఇంతకీ రామ్గోపాల్ వర్మ చేసిన తప్పేంటి .. ?’ అని జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు.
వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి చేసిన ట్వీట్పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన ఎదురవుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కానిస్టేబుల్ నుండి డిజి వరకూ ఇసి పరిధిలో ఉంటారన్న విషయం కూడా ప్రతిపక్ష నేతకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. సమీక్షలు చేయడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదనీ, అధికారాలు లేని సిఎం, అపధర్మ ముఖ్యమంత్రి అని వైసిపి నేతలే అంటున్న ఈ తరుణంలో జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిని విమర్శించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు తెలంగాణలో ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా 20మంది విద్యార్థులు మృతి చెందితే కనీసం స్పందించకుండా ఒక్క ప్రకటన కూడా చేయని జగన్మోహనరెడ్డి సినీ దర్శకుడు రామ్గోపాల్ విషయంలో స్పందించడం హస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు.
విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..!
చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2019