ఎన్నికల కాలం.. కానీ ఎండాకాలం. సాధారణంగా రాజకీయ నాయకులంటే ఎంచక్కా ఏసీ గదుల్లో కూర్చుని కులాసాగా గడిపేస్తుంటారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏప్రిల్ – మే నెలల్లో ప్రచారం చేయాల్సి వచ్చేసరికి నాయకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్నికలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇందుకు ఓ తరుణోపాయం ఆలోచించారు.
అభిషేక్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో వేడి ఎక్కువగా ఉంటోందని స్వయంగా తాను వెళ్లడానికి బదులు జీపులో తన నిలువెత్తు విగ్రహాన్ని పంపించారు. అభిషేక్ మద్దతుదారులు ఆయన విగ్రహంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫొటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో షేర్ చేస్తూ అందరూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
కొందరు నెటిజన్లు ఎండవేడికి ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయా అని ఆడిపోసుకుంటున్నారు. ఇంకొందరు జనాలు మాత్రం నాయకుడి బదులు ఈ బొమ్మ మాతో మాట్లాడుతుందా? మ సమస్యలు బొమ్మ తీరుస్తుందా అని నిలదీస్తున్నారు. తాము కూడా ఇళ్లలోనే ఉండి ఓటు వేయకుండా ఫొటోను వాట్సాప్ ద్వారా అభిషేక్ కు పంపుతామని మండిపడుతున్నారు. కొంత మంది బీజేపీ మద్దతుదారులు మాత్రం ఇలాంటి ఆలోచనలు మమతా బెనర్జీకే వస్తాయని చెబుతున్నారు.