అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. పాదయాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో కొందరు నేతలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణకు మూహూర్తంతో సహా ఎవరెవరికి స్థానం కల్పించాలనే విషయంపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. జూన్ ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. జూన్ 15 లేదా ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లోపుగానే మంత్రి వర్గ విస్తరణ జరపాలని జగన్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. కాగా ప్రతి జిల్లా నుండి ముగ్గురు నలుగురు సీనియర్ సభ్యులు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు.
కృష్ణాజిల్లా నుండి కొలుసు పార్థసారధి, సామినేని ఉదయబాను, మేకా ప్రతాప్ అప్పారావు, పేర్ని నాని, గుంటూరు నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, కోన రఘుపతి, ప్రకాశం జిల్లా నుండి అదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుండి మేకపాటి గౌతంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి, చిత్తూరు నుండి రోజా, పెద్దిరెడ్డి రామంచ్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కడప నుండి అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, కర్నూల్ నుండి హఫీజ్ ఖాన్, శ్రీదేవి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, అనంతరంపురం నుండి కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్నారాయణ, శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, కళావతి, విజయనగరం నుండి బొత్సా సత్యనారయణ, రాజన్నదొర, పుష్ప శ్రీవాణి, విశాఖపట్నం నుండి గుడివాడ అమరనాధ్ రెడ్డి, ముత్యాలనాయుడు, గొర్లె బాబూరావు, తూర్పు గోదావరి జిల్లా నుండి కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, తానేటి వనిత, గ్రంధి శ్రీనివాస్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.