అమరావతి: వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై చర్య లేనందుకు నిరసనగా రెండేళ్ల క్రితం శాసనసభను బహిష్కరించిన ఆనాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విజయగర్వంతో అదే శాసనసభలోకి సభానాయకుడిగా అడుగుపెట్టారు.
2014లో 67 సీట్లకు పరిమితమయిన వైసిపి 2019 ఎన్నికలలో 50 శాతం వోట్లు సాధించి 175 స్థానాల అసెంబ్లీలో 151 సీట్లు సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని పార్టీ అధినేత ఒంటిచేతితో సాధించారనే చెప్పవచ్చు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ గత అయిదేళ్ల కాలంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ధైర్యం కోల్పోలేదు.
నవ్యాంధ్ర మొదటి శాసనసభలో సభానాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ప్రతిపక్షనేత హోదాలో కూర్చున్నారు. టిడిపి తరపున 23 మంది మాత్రమే ఎన్నికయ్యారు. మిగిలిన ఒక్క సభ్యుడూ జనసేన ప్రతినిధి. ఈసారి అసెంబ్లీలో విశేషం ఏమంటే జాతీయ పార్టీలకు దేనికీ కూడా ఈ సభలో ప్రాతినిధ్యం లేదు.
రాష్ట్రవిభజన జరిపించి 2014 ఎన్నిలలో మట్టి కరిచిపోయిన కాంగ్రెస్ పార్టీ అయిదేళ్ల తర్వాత కూడా ఒక్క సీటూ గెలవలేకపోయింది. జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సిపిఐ, సిపిఎం గెలవడం కాదుకదా అసలు ప్రభావమే చూపలేకపోయాయి. బిఎస్పి కూడా జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది కానీ ఫలితం లేకపోయింది.
బుధవారం సభ ప్రారంభం అయిన తర్వాత సభా నాయకుడిగా వైఎస్ జగన్ మొదట సభ్యుడిగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. అనంతరం సభ్యులు వరసక్రమంలో ప్రమాణం చేశారు. 13వ తేదీన ఆముదాలవలస సభ్యుడు తమ్మినేని సీతారాంను సభ స్పీకర్గా ఎన్నుకుంటుంది. డిప్యూటీ స్పీకర్ను కూడా ఈ సమావేశాలలోనే ఎన్నుకుంటారు.
14 వ తేదీన గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాలు 18 వ తేదీ వరకూ జరుగుతాయి.