(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన అవసరం లేదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. గురువారంనాటి పరిణామాలను పరిశీలిస్తూ ఆయన ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపారు.
ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికిపాటి మోహనరావు, టిజి వెంకటేష్ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును గురువారం సాయంత్రం రెండవసారి కలిసి రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని కోరుతూ ఒక లేఖ ఇచ్చారు. రాజ్యాంగం పదవ షెడ్యూల్ నాలుగవ పేరా ప్రకారం విలీనం ఆమోదించాలని వారు కోరారు.
ఈ పరిణామాలపై చంద్రబాబు స్పందిస్తూ, సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు. తాను నవ్యాంధ్ర అభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా కోసమే పోరాడానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు స్థైర్యం కోల్పోరాదని ఆయన కోరారు.