కాకినాడ: అయిదేళ్ల పాలన తర్వాత ప్రజల తిరస్కరణకు గురయిన టిడిపికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న తరుణంలో ఒక పక్క నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించగా మరోపక్క కాపు కులానికి చెందిన 14 మంది టిడిపి నేతలు రహస్యంగా సమావేశం కావడం సంచలనం కలిగించింది.
రామచంద్రాపురం మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాకినాడలోని ఒక హోటల్లో వీరందరూ సమావేశమయ్యారు. బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు, పంచకర్ల రమేశ్బాబు, ఈలి నాని ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశం గురించిన సమాచారం బయటకు రాగానే వీరి అడుగులు ఎటువైపన్న ఊహాగానాలు మొదలయ్యాయు. బిజెపిలో చేరే విషయమై చర్చించేందుకు సమావేశమయ్యారనీ, కాదు వైసిపిలోననీ పుకార్లు వచ్చాయి. అయితే సమావేశమయిన టిడిపి నేతలు అన్ని ఊహాగానాలనూ ఖండించారు. తాము పార్టీని వీడేది లేదని వారు స్పష్టం చేశారు. పరాజయానికి కారణాలేమిటో విశ్లేషించేందుకు సమావేశయ్యాము తప్ప మరో కారణం లేదని పేర్కొన్నారు.