అమరావతి: ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతు ఆత్మహత్యలపై సమీక్ష జరిపారు.
గత అయిదేళ్లలో డిసిఆర్బి లెక్కల ప్రకారం మొత్తం 1513మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 391మంది రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చినట్లు గణాంకాలు ఉన్నాయని జగన్ అన్నారు. గత ప్రభుత్వం ఈ కుటుంబాలకు పరిహారం నిరాకరించినట్లు అర్థమవుతోందని జగన్ పేర్కొన్నారు. జిల్లాల్లో నివేదికలను పరిశీలించి అర్హత ఉన్న కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్లు బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి పరిహారం అందజేసి వారిలో ఆత్మస్థైర్యం నింపాలని సిఎం సూచించారు.
రైతులు, కౌలు రైతులకు ఏ కష్టం వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలని జగన్ సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయల వంతున పరిహారం ఇచ్చేలా చట్టం తీసుకొస్తామనీ, ఈ పరిహారాన్ని బాధిత కుటుంబం తప్పితే మరెవరూ తీసుకోలేని విధంగా చట్టాన్ని రూపొందిస్తామని సిఎం అన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, పలువురు మంత్రులు పాల్గొన్నారు.