(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనారోగ్యం పాలైతే.. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ఇచ్చే మందులు వేసుకుంటున్నారా ? అయితే, వాటితో కొంచం జాగ్రత్తగా ఉండండి. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో పీహెచ్సీ వైద్యులు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో ఇచ్చిన ప్యారసిటమల్ ట్యాబ్లెట్లో ఏకంగా దోమ కనిపించి కలవరానికి గురి చేసింది. గ్రామంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు. లక్ష్మీనగర్కు చెందిన సీహెచ్ రాము అనే వ్యక్తి జ్వరానికి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో వైద్యులు అతనికి కొన్ని మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లాక ట్యాబ్లెట్లను వేసుకుంటుండగా ప్యారసెటమాల్ ప్యాకింగ్లో మృతి చెందిన దోమ కనిపించింది. ఈ విషయాన్ని రాము వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది వాటిని వెనక్కి తీసుకొని వేరే వాటిని ఇచ్చి పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైద్య సిబ్బంది చెప్పారు. ట్యాబ్లెట్ల ప్యాకింగ్లో నాణ్యత పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.