(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు పక్షాలకూ ఏకాభిప్రాయమే ఉంది. విశ్వాసపరీక్షకు సభ సమావేశమయితే దానిని నడిపేందుకు అనుసరించాల్సిన పద్ధతి విషయంలో రెండు పక్షాలూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్షకు ఎప్పుడు నిలవాలన్న అంశంపై, విశ్వాసపరీక్షకు సభ సమావేశమయినపుడు అనుసరించాల్సిన విధానంపై సుప్రీంకోర్టులో సోమవారం ప్రధానంగా వాదనలు జరిగాయి.
విశ్వాస పరీక్షకు అసెంబ్లీ సమావేశమైతే మొదట స్పీకర్ ఎన్నిక జరగలా వద్దా అన్న విషయంలో ఇరు పక్షాలూ భిన్న వాదనలు వినిపించాయి. విశ్వాసపరీక్ష ఒక్కటే ఎజెండాలో ఉండాలనీ, స్పీకర్ ఎన్నిక జరగరాదనీ కాంగ్రెస్ – సేన – ఎన్సిపి వాదించింది. ప్రోటెం స్పీకర్ ఎన్నిక మొదట జరగాలనీ, తర్వాత సభ్యుల ప్రమాణస్వీకారం జరగాలనీ, అనంతరం స్పీకర్ ఎన్నిక జరగాలని బిజెపి వాదించింది. ఆ తర్వాత మాత్రమే విశ్వాసపరీక్ష ఉండాలని బిజెపి పేర్కొన్నది. అలా కుదరదనీ, ప్రొటెం స్పీకర్ ఎన్నిక జరిగిన వెంటనే విశ్వాసపరీక్ష జరగాలనీ కాంగ్రెస్ – సేన – ఎన్సిపి తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
సింఘ్వీ ఈ వైఖరి తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగాల్సివస్తే ఎన్సిపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడి హోదాలో అజిత్ పవార్ ఆ పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఎన్సిపి ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఆయన స్పీకర్ను కోరతారు. అలాకాక విప్కు అనుకూలంగా వ్యవహరిస్తే అజిత్ పవార్ను తమ నాయకుడిగా అంగీకరించినట్లవుతుంది. ఈ మతలబు కారణంగానే విశ్వాసపరీక్ష అన్న సింగిల్ పాయింట్ ఎజండాతో సభ సమావేశం కావాలని ఎన్సిపి – శివసేన – కాంగ్రెస్ కోరుతున్నది.
ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్సిపి ఎమ్మెల్యేలు అజిత్ పవార్ను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ – సేన – ఎన్సిపి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత గవర్నర్కు సమర్పించేందుకు ఎన్సిపి సభ్యుల సంతకాలు తీసుకున్నారు. రాత్రికి రాత్రి బిజెపి పక్షానికి అనుకూలంగా మారిన అజిత్ పవార్ ఆ సంతకాలను బిజెపికి అనుకూలంగా గవర్నర్కు సమర్పించేందుకు వాడారు. సోమవారం సుప్రీంకోర్టులో కూడా అజిత్ పవార్ తరపు లాయర్ ఆ సంతకాలనే ఉదహరించారు. తన క్లయంట్ ఎన్సిపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడనీ, అందుకు రుజువుగా వారి శాసనసభ్యుల సంతకాలు ఉన్నాయనీ ఆయన అన్నారు.