న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మహిళా ఎంపీలను కూడా మార్షల్స్ లాక్కెళ్లారు. మార్షల్స్ తమ మహిళా సభ్యులపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
సభ నియమావళికి విరుద్ధంగా కాంగ్రెస్ సభ్యులు బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు. ఎంపీలు హిబీ ఈడెన్, టిఎన్ ప్రతాపన్ తీరును స్పీకర్ తప్పుపట్టారు. ప్లకార్డులు తీసివేసేందుకు ఎంపీలు నిరాకరించడంతో.. స్పీకర్ ఆ ఇద్దరు ఎంపీలను సభ నుంచి బయటకు పంపేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనను ఖండించారు. అన్ని పార్టీలు లోక్ సభ యొక్క పవిత్రతను, సంప్రదాయాలను గౌరవించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామల మీద కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా..సోమవారం సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసనలో పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య’ చేయవద్దంటూ కాంగ్రెస్ సభ్యులతో కలిసి నినాదాలు చేసారు. అదే సమయంలో ఉభయ సభలు సమావేశం అయిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ పలుమార్లు వారించేందుకు ప్రయత్నించారు. అయినా వారు అంగీకరించకపోవటంతో మార్షల్స్ ద్వారా ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మార్షల్స్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మహారాష్ట్ర అంశాన్ని సభలో లేవనెత్తామని, ప్రజాస్వామ్యబద్దంగానే నిరసన వ్యక్తం చేశామని కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ అన్నారు. తమను మార్షల్స్ మమ్ముల్ని బలవంతంగా లాక్కెళ్లారన్నారు. దీనిపై స్పీకర్ వద్ద ఫిర్యాదు చేశామని ఎంపీ హిబీ ఈడెన్ తెలిపారు. మేం వెల్లోకి వెళ్లకున్నా.. మార్షల్స్ మమ్ముల్ని తీసుకువెళ్లారని ఎంపీ ఆరోపించారు. మహిళా ఎంపీలను కూడా మార్షల్స్ లాక్కెళ్లారని తెలిపారు.