న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ.. ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరింది. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయనుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించనుంది.
దిశ కేసులో షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద నిందుతులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సంఘటనాస్థలానికి తీసుకెళ్లగా వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన మొత్తాన్నీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు స్వీకరించింది.
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారానికి, హత్యకు గురైన శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ సమీపంలోని స్థలాన్ని, కాలిపోయిన స్థితిలో దిశ మృతదేహం లభించిన చటాన్ పల్లి ఫ్లైఓవర్ ప్రాంతాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలిస్తుంది. నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చే నివేదికకు ప్రస్తుతం పోలీసులు చెబుతున్న కారణాలు, సంఘటనాలో గుర్తించిన ఆధారాలు, మీడియా కథనాలను క్రోడీకరించిన అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయనుంది.
ఇదిఇలా ఉంటే.. ఈ ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొందరు మాత్రం పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నారు.