తిరుపతి: ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్బాబు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. దేశాన్ని పాలించటానికి మోదీ, అమిత్ షా సరైన వ్యక్తులని అన్నారు. ఇలాంటి నాయకులను తన జీవితంలో చూడలేదని పేర్కొన్నారు. దేశానికి అమిత్ షా నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. త్వరలొనే పార్టీ మారతారనే ప్రచారానికి మోహన్బాబు వ్యాఖ్యలతో బలం చేకూరింది.
జనవరి 6న మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు అరగంటపాటు మోదీతో భేటీ అయిన మంచు ఫ్యామిలీ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ… మోహన్బాబు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే, దీనిపై వెంటనే సరే అని చెప్పకపోయినా… మోహన్బాబు నవ్వుతూ మోదీ ప్రతిపాదనను స్వాగతించినట్లు తెలిసింది. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న ప్రధానిని కలిశారు. మోహన్బాబు ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరాలని మోహన్ బాబుకు ఆహ్వానం అందిన నేపథ్యంలోనే మోదీని కలిసినట్టు వార్తలు వినిపించాయి. సమావేశం అనంతరం ‘వాట్ ఏ మ్యాన్! నరేంద్రమోదీ’ అంటూ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలని కలవడం కలవడంతో రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్తో దగ్గరి బంధుత్వం ఉన్న ఆయన.. బీజేపీలో చేరతారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడు అయిన సినీనటుడు మోహన్ బాబు… ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు రాజకీయాలపై వ్యాఖ్యలు చేసినా… ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్బాబు కుటుంబం… వైసీపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేసింది.