(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శ్రీకాకుళం: విశాఖ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై సిఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని చెప్పారు. సిఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటాలకు ధీటైన సమాధానం చెబుతామన్నారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ను, ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు జనాల్ని రెచ్చిగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని తమ్మినేని విమర్శించారు.అమరావతిలో జరుగుతున్నది సహజసిద్ధమైన పోరాటం కాదని అన్నారు. అసలుసిసలైన ప్రజా ఉద్యమం అంటే ఏంటో తాము చూపిస్తామని తమ్మినేని పేర్కొన్నారు.శ్రీకాకుళం నుంచి రాజయలసీమ వరకూ సాగే ఉద్యమం ఎలా ఉంటుందో చంద్రబాబు చూస్తారన్నారు.
ఉత్తరాంధ్ర టిడిపి నేతలు అమరావతి రాజధానికి మద్దతు తెలుపడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఇన్నేళ్లుగా ఈ ప్రాంతం పేదరికం, వెనుకబాటుతనానికి గురవుతుంటే వాళ్లకు కళ్లు లేవా అని స్పీకర్ ప్రశ్నించారు.
విజయవాడలో చంద్రబాబు అరెస్టు విషయం గురించి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని అన్నారు. గతంలో ఏ కారణం లేకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ను విశాఖ ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన విషయం గుర్తు లేదా అని తమ్మినేని ప్రశ్నించారు.