(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
రాజకీయంగా సమీప ప్రత్యర్ధులు ఎవరూ లేకుండా చేసుసున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేవలం 20 రోజుల వ్యవధిలో 1500 పడకల కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు చైనాలో ఎనిమిది రోజుల వ్యవధిలో 1000 పడకల ఆసుపత్రి నిర్మించారని గొప్పగా చెప్పుకోవడం చూశాము. అయితే తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ రికార్డ్ తిరగ రాశారు.
కరోనా వైరస్ ప్రభావాన్ని తీవ్రంగా పరిగణించిన కెసిఆర్
దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన తొలినాళ్లలో కెసిఆర్ దీన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఇది అంత ప్రమాదకరం కాదని తేలికగా తీసుకున్నారు. పారాసెటమాల్ లాంటి మాత్ర వేసుకుంటే చాలు అన్నట్లుగా కెసిఆర్ చెప్పారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వివిధ దేశాలతో పాటు మన దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దీన్ని సిఎం కెసిఆర్ తీవ్రంగా పరిగణిస్తూ నివారణ చర్యలను ఉదృతం చేశారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా తొలుత ఈ నెల 31 వరకు, మళ్ళీ మే 7వ తేదీ వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
గచ్చిబౌలిలో 1500 పడకల ఆసుపత్రి
హైదరాబాద్ శివారు గచ్చిబౌలిలో గల స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసి 1500 పడకల ఆస్పత్రిగా రూపొందించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల్లో దాదాపు వెయ్యి మంది కార్మికులు 20 రోజుల పాటు అహర్నిశలు శ్రమించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్ది నేడు ప్రారంభించారు. కరోనా వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఫర్నిచర్, మెడికల్ కిట్స్ అన్నీ సిద్ధం చేశారు.
తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి భవనంలో 468 గదులు ఉండగా 50 పడకల ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో అంతస్తులో 36 గదులు ఉండగా ఒక్కో గదిలో 23 పడకలు ఏర్పాటు చేశారు. కరోనా పేషంట్ లను ఈ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ ద్వారా 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు.
భవిష్యత్ లో టిమ్స్
కరోనా తగ్గిన తరువాత ఈ ఆస్పత్రిని భువనగిరి ఏయిమ్స్ తరహాలో టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్)ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏయిమ్స్ తరహాలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.