కరోనా కాలం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన మంత్రి మోడీ టీవీలో కనిపిస్తున్నారు అంటే ఏదో తెలియని కొత్త విషయాన్ని చెబుతారని అందరూ ఆశిస్తుంటారు. లోక్ డౌన్ మొదటి విడత ప్రకటన గాని.. లాక్ డౌన్ రెండో విడత ప్రకటన గాని..చప్పట్లు కొట్టమని చెప్పినప్పుడు కానీ..దీపాలు పెట్టమని చెప్పాను గానీ.. ప్యాకేజీ గురించి ట్రయిలర్ గా ప్రకటన చేసినప్పుడు కానీ..ఇలా ఏ విషయాన్ని అయినా సరే వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చారు. ఇలా ఈసారి కూడా మోడీ టీవీలో కనిపిస్తున్నారంటే..ఏదైనా ఒక విషయాన్ని జాతికి వెల్లడిస్తారని అందరూ ఆశించారు. కానీ ఈ రోజు ఆయన ప్రసంగం చప్పగా సాగింది.
మోడీ మొదటి సారి వీడియో సందేశం ఇచ్చినప్పుడు దేశంలో కరోనా కేసులు రోజుకు 200. రెండో సారి వీడియో సందేశం ఇచ్చినప్పుడు దేశంలో రోజుకు 1200. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే నాటికీ రోజుకు కరోనా కేసులు రోజుకు 2400. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 20 వేలు. కరోనా మరణాలు రోజుకు 400. ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ వంటి దేశాలను తలదన్ని అమెరికా తర్వాత రెండవ అగ్ర దేశంగా భారతదేశం పైపైకి వెళుతోంది. ఈ తరుణంలో బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి వీడియో సందేశం ఇస్తున్నారంటే కరోనా కట్టడికి ఏమైనా కొత్త నిర్ణయం ఉంటుందేమో అనే ఆశ..ఒక రకమైన భావం.. ప్రతి భారతీయుడు మదిలో కల్గింది. ఆ ఆశతోనే 4 గంటలకు ఈ రోజు మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని దాదాపు అందరూ విన్నారు. ఇందులో కొత్త ప్రకటన ఏమీ లేకపోగా..కరోనా కట్టడికి సంబంధించి ప్రయత్నాలు కొత్తగా ఏమి లేవు. వీడియో సందేశం ఇవ్వాలి.. చాలా రోజుల తర్వాత జాతికి కనిపించాలన్న ప్రయాస తప్ప మోదీ ప్రకటన లో గాని, ప్రయత్నాల్లో గాని ఏమీ పస కనిపించలేదు.
పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి.. వలస కార్మికులకు ఉపాధి ఇంకా దొరకలేదు.. కరోనా బాధితులు పెరుగుతున్నారు.. ఆస్పత్రిలో వెంటిలేటర్లు సరిపోవట్లేదు.. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా శ్రద్ద వహించడం లేదు, ప్రయత్నాలు పెద్దగా చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి దశలో ప్రధాన మంత్రి హోదాలో మోడీ రాష్ట్రాల వారీగా సమీక్ష చేయడం.. వారికి సరైన దిశానిర్దేశం చేయడం. కరోనా కట్టడికి రాష్ట్రాలకు ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం.. లేదా ఆసుపత్రిలో సౌకర్యాల కోసం ప్రత్యేక నిధులు ఇవ్వడం.. వంటి ప్రకటనలు ఏమీ లేవు. ఆర్థిక ప్యాకేజీ కొనసాగింపుగానే ఈ రోజు మరో ఐదు నెలల పాటు రేషన్, గోధుమలు, బియ్యం ఇస్తామని కంటి తుడుపు ప్రకటన ఒకటి చేశారు. మొత్తానికి మోడీ మాటల్లో ఈరోజు ప్రయాస తప్ప కరోనాకు సంబంధించి ప్రయత్నం అయితే ఏమీ కనిపించలేదు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.