YSRCP: ఏపిలో వైసీపీ ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, ఈ సారి అధికారం కైవశం చేసుకోవడం ఖాయమని టీడీపీ గంపెడాశలతో ఉంది. అయితే టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా ఓ సర్వే సంస్థ అంచనాలను విడుదల చేసింది. ఏపిలో మరో సారి వైసీపీ ప్రభంజనం ఖాయమని అంటోంది టైమ్స్ నౌ సర్వే. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 నుండి 25 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఏపిలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా, దాదాపు క్లీన్ స్వీప్ ఖాయమని అంటోంది. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హవా మళ్లీ కొనసాగుతుందని, 2024 ఎన్నికల్లో కూడా అతి పెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందని అంటోంది టైమ్స్ నౌ. దేశ వ్యాప్తంగా టైమ్స్ నౌ, నవభారత్ సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం..
అతి పెద్ద పార్టీగా బీజేపీ 292 నుండి 338 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 106 నుండి 144 స్థానాలు దక్కవచ్చని సర్వే లో తేలింది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి 20 నుండి 22 లోక్ సభ సీట్లు, ఏపిలో వైసీపీకి 24 నుండి 25 స్థానాలు వస్తాయని సర్వే లో అంచనా వేసింది. ఒడిశాలో అధికార బీజూ జనతాదళ్ కు 11 నుండి 13 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు 50 నుండి 80 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది.
బీజేపీ కూటమికి 38.2 శాతం, కాంగ్రెస్ కూటమికి 28.7 శాతం, ఇతరువకు 33,1 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది బీజేపీ కూటమి 300 కుపైగా స్థానాలు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. 26 శాతం మంది కష్టమని, 19 శాతం మంది ఎన్నికల నాటికి స్పష్టత వస్తుందని, 13 శాతం మంది ఎమీ చెప్పలేమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇక మోడీ పాలన తీరుపై 51 శాతం సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వెల్లడించింది.
ప్రతిపక్షాల కూటమి మోడీకి పోటీ ఇవ్వగలదా అంటే ..49 శాతం మంది నో చెప్పారు. 37 శాతం మంది పోటీ ఇవ్వగలదని అభిప్రాయాన్ని వెల్లడించారు. 15 శాతం మంది మాత్రం తటస్థంగా ఉన్నారని చెప్పింది. ఇక రాహుల్ పై అనర్హత వేటు అంశం కాంగ్రెస్ కు లాభిస్తుందా అంటే 39 శాతం మంది నో అన్నారుట. 23 శాతం మంది ప్రజలు రాహుల్ కు సానుభూతి వస్తుందని చెప్పారు. మరో 11 శాతం మంది ఎలాంటి ప్రభావం చూపదు అని అన్నారు. దేశంలోనే శక్తివంతమైన ప్రధాని అభ్యర్ధిగా మోడీకి 64 శాతం ఓట్లు వేయగా, రాహుల్ గాంధీకి 13, కేజ్రీవాల్ కు 12, నితీష్ కుమార్ కు ఆరు, కేసిఆర్ కు 5 శాతం మంది ఓట్లు వేశారు.
ప్రకాశంలో చంద్రబాబుకు నిరసన సెగ .. యర్రగొండపాలెంలో హైటెన్షన్