YSRCP: వైసీపీలో చాలా మంది నేతలు తమ వారసుల కోసం రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని కొందరు, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా మరి కొందరు పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై గతంలోనే తమ అభిప్రాయాలను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారి వారసులే చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం ఈ సారికి మాత్రం వారినే పోటీ చేయాలని సూచించారని అంటున్నారు. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ముస్తాఫా కూడా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తన కుమార్తె పోటీ చేస్తుందని చెప్పారు. జగన్మోహనరెడ్డి ఆశీస్సులతో తన కుమార్తె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఇలా వారసుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తుండగా సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని అంటున్నారు. ఒక వేళ మార్పు చేయాల్సి వస్తే సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కూడా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు.
YSRCP: వయసు పైబడింది అంటూ..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రీసెంట్ గా ఎమ్మిగనూరు లో ఉప్పర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ తననే పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సూచించారు కానీ వయసు పైబడిన రీత్యా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనకు ఇప్పుడు 83 ఏళ్లు అని, గుండె జబ్బు కూడా ఉందనీ, దీంతో జనంలో ఎక్కువ సేపు తిరగలేకపోతున్నానని జగన్ కు చెప్పినట్లు తెలిపారు. తన కుమారుడు జగన్మోహనరెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో సర్వే చేస్తున్నట్లు జగన్ తనతో చెప్పారనీ, కావున తన కుమారుడుకి టికెట్ వస్తే అందరూ సహకరించాలని చెన్నకేశవరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేము తప్పుకుంటాం.. మా వారసులకు టికెట్ ఇవ్వండి అని నేతలు కోరితే గుడ్డిగా జగన్ ఒకే అని చెప్పే పరిస్థితి వైసీపీలో లేదు. సర్వే ఆధారంగానే వారి గెలుపునకు అవకాశాలు ఉన్నాయో లేదో తెలుసుకుని మాత్రమే టికెట్ ఖరారు చేస్తారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..
చెన్నకేశవరెడ్డి ఎన్నిగమనూరు నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004,2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవరెడ్డి.. వైసీపీకి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ కోసం రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి మూడవ సారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి వైసీప తరపున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడిని కాదని జగన్మోహనరెడ్డి చెన్నకేశవరెడ్డికే టికెట్ ఇవ్వగా దాదాపు 25వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి బీవి జయ నాగేశ్వరరెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. అదే జయ నాగేశ్వరరెడ్డిపై 2019 ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి గెలుపొందారు. గతంలో ఓడిపోయిన చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డికి సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.
కేంద్రానికి సుప్రీం కోర్టు ఊహించని షాక్ .. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలపై సంచలన వ్యాఖ్యలు