AP High Court: అసలే ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నుండి ఊహించని షాక్ ఎదురైంది. ఏపి సర్కార్ కు హైకోర్టు నుండి తరచు వ్యతిరేక తీర్పులు రావడం సర్వసాధారణమైపోయింది. పలు ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై సమీక్ష జరుపుకుని అటువంటి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొందరు ఉన్నత స్థాయి అధికారులు న్యాయ సలహాలు పాటించకుండా ముందడులు వేయడం వల్ల ప్రభుత్వం బ్లేమ్ అవుతోంది. అధికారులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోంది. ఇటీవల ఎయిడెడ్ కళాశాలల విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబడుతూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
Read More: Badvel Bypoll: వైసీపీ – బీజేపీ దోస్తాన్ ఉందా? లేదా..? తేల్చనున్న మోడీ..!!
AP High Court: ఉపాధి హామీ పనుల చెల్లింపులపై హైకోర్టు కీలక తీర్పు
విషయంలోకి వెళితే.. కేంద్ర నిధులతో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి టీడీపీ ప్రభుత్వహయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా జగన్ సర్కార్ జాప్యం చేస్తూ వచ్చింది. సర్పంచ్ ల సంఘ గౌరవాధ్యక్షుడుగా యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఉపాధి హామీ బిల్లులపై పోరాటం సాగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపనలు పంపినా, నిరసన కార్యక్రమాలను నిర్వహించినా పెండింగ్ బిల్లులను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బాబూ రాజేంద్ర ప్రసాద్ సహా దాదాపు 1013 మంది హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
నాలుగు వారాల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే
ఉపాధి హామీ పనులు చేసిన వారికి తక్షణమే బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఈ బిల్లుల చెల్లింపు ముగియాలని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున బిల్లులకు 20 శాతం మేర తగ్గించి చెల్లించడానికి అనుమతించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసి పుచ్చింది. అంతే కాకుండా పెండింగ్ బిల్లులను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని సంచలన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయకుంటే కోర్టు దిక్కరణ చర్యలకు వెనుకాడబోమని హైకోర్టు తెలిపింది.