ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి తదితరులపై జరిగిన హత్యాయత్నం కేసులో అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లగడ్డలో ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం రాత్రి నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆ సందర్భంలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి గ్రామం వద్ద భారీ ఏర్పాట్లు చేశాయి.
ఇరువర్గాల మధ్య కొంత కాలంగా వర్గపోరు, విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో ఏవి సుబ్బారెడ్డి ముఖానికి గాయం అయి ముక్కు నుండి రక్తం కారింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను వాహనంలో అక్కడ నుండి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అక్కడ నుండి పంపించి వేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన సమయంలో భూమా అఖిలప్రియ అక్కడే ఉన్నారు. ఆ దాడికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అఖిలప్రియ అనుచరులు అరెస్టు
ఏవి సుబ్బారెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇవేళ వేకువజామున నంద్యాల నుండి ప్రత్యేక పోలీసు బృందాలు ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసానికి వెళ్లి .. దాడి చేసిన నిందితులుగా అనుమానిస్తున్న భూమా అనుచరులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వాహనాల్లో ఎక్కించి తరలించారు. నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ నివాసానికి చేరుకున్నాయి. డీఎస్పీ మహేశ్వరరెడ్డి నేరుగా అఖిలప్రియ ఇంటిలోపలికి వెళ్లి కేసు వివరాలు తెలియజేసి అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. భూమా అఖిలప్రియ తన సొంత వాహనంలో కూర్చున్న తర్వాత పోలీసు బందోబస్తు నడుమ నంద్యాలకు తీసుకువెళ్లారు. అనంతరం పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Road Accident: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు తెలంగాణ వాసులు మృతి