Breaking: తనపై రెక్కీ నిర్వహించారంటూ ఇటీవల విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. రాధా వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి 2 ప్లస్ 2 గన్ మెన్ ల భద్రతకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసు భద్రతను రాధ తిరస్కరించినప్పటికీ పోలీసులు మాత్రం రాధ ఇంటి వద్దకు డ్యూటీ నిర్వహిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు..వంగవీటి రాధ పై రెక్కీ అంశంపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధా చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరేలా రాధా కార్యాలయం వద్ద ఓ అనుమానాస్పద స్కూటీ ఉండటం కలకలాన్ని రేపుతోంది.
Breaking: రాధా కార్యాలయం వద్ద అనుమానాస్పద స్కూటీ
విజయవాడ బందర్ రోడ్డులో రాఘవయ్య పార్క్కు ఎదురుగా వంగవీటి రాధా కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పక్కన గత కొద్ది రోజులుగా ఒక స్కూటీ నిలుపుదల చేసి ఉండటంతో రాధా అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాధ అనుచరులు కృష్ణలంక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా పోలీసులు అక్కడకు చేరుకుని స్కూటీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ స్కూటీ ఎవరిది? ఎన్ని రోజుల నుండి ఇక్కడ పార్క్ చేసి ఉంది ? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే రాధా కార్యాలయం పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులోకి వ్యక్తి అక్కడ స్కూటీ పార్క్ చేసి వెళ్లినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.