Chandra Babu: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే పరిస్థితి లేదని అంటున్నారు. అందుకే జనసేన, బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఏ పార్టీతో అయినా స్నేహం చేయడం, ఆ తరువాత పక్కన పెట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఇదే విషయంపై ఇటీవల తిరుపతిలో అమరావతి రైతుల సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ చంద్రబాబుపై చలోక్తి విసిరారు. అవసరం ఉన్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటారు. అవసరం తీరిన తరువాత దూరం పడేస్తారు అంటూ నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయంలో అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఒకే మాట మీద ఉండటంతో అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు బహిరంగ సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.
Chandra Babu: బీజేపీ నుండి దూరం అయిన తరువాత..
గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా డిమాండ్ తో కేంద్రంలోని బీజేపీని విభేధించి టీడీపీ బయటకు వచ్చింది. ఆనాడు ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జత కట్టడంతో చంద్రబాబు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ పరోక్షంగా జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి పరోక్ష సహకారం అందించింది అన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదులుకోవడంతో టీడీపీ ఘోర ఓటమి పాలుకావడమే కాక బీజేపీ, జనసేన కూడా దెబ్బతిన్నాయి. జనసేన ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించగా బీజేపీ అసలు బోణీ కొట్టలేదు. బీజేపీ నుండి దూరం అయిన తరువాత ఆ పార్టీ అగ్రనేతల పవర్ చంద్రబాబుకు తెలిసివచ్చినట్లు అయ్యింది.
బీజేపీతో చేతులు కలపాలన్న ప్రయత్నంలో
నెలన్నర క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మాత్రమే కలిసి టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి, రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు అందజేసి వచ్చేశారు చంద్రబాబు. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలోనూ కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొంది. మరో పక్క విపక్షాలు కూడా బీజేపీని వ్యతిరేకంగా నిలబడలేని పరిస్థితి దేశంలో ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి బీజేపీతో చేతులు కలపాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని టాక్. ఇప్పుడిప్పుడే బీజేపీ నుండి సానుకూల సంకేతాలు ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఏపి బీజేపీలో టీడీపీని పూర్తిగా వ్యతిరేకించే వర్గానికి ఆ పార్టీ అధినాయకత్వం కొంత పక్కన పెట్టింది. సోము వీర్రాజు వంటి నాయకులు టీడీపీపై అంతగా విమర్శలు చేయడం లేదు. అధికార వైసీపీపై బీజేపీ దాడి మొదలు పెట్టింది.
పార్లమెంట్ సమావేశాల సమయంలో..
రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు అవ్వడం, ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తుండటంతో చంద్రబాబు మరో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ సమయంలోనే ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అందుబాటులో ఉంటారని భావిస్తున్న చంద్రబాబు..వారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, టీడీపీ నేతలపై అక్రమంగా పెడుతున్న కేసులు తదితర అంశాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఈ సారి అయినా చంద్రబాబు కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.