Parliament Monsoon Session 2021: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఈసారి గట్టిగానే గళం విప్పింది. మొదటి రోజు, రెండవ రోజు రాజ్యసభ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి చర్చకు నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి అందజేశారు. అయితే చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో రెండు రోజులుగా వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై రాజ్యసభలో నిరసనలు తెలియజేస్తున్నారు.
Read More: Parliament Monsoon Session 2021: గేరు మార్చిన వైసీపీ..! కేంద్రంపై ఇక యుద్ధమేనా..!?
ఇప్పటి వరకూ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ ప్రస్తుతం గేరు మార్చి స్పీడు పెంచింది. అయితే ఈ ఊపు ఎంత కాలం సాగిస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. రేపు రాజ్యసభ లో కీలక బిల్లుల ఆమోదంకు వచ్చినప్పుడు వైసీపీ స్టాండ్ ఏమిటో తెలిసిపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రం ప్రవేశపెట్టే కీలక బిల్లులు లోక్ సభలో వారికి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఎవరితో పని లేకుండానే ఆమోదం పొందుతాయి. అయితే రాజ్యసభ విషయానికి వచ్చేసరికి వైసీపీ లాంటి పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం అవుతుంది. ఆ సమయంలో విపక్షాల మాదిరిగా వైసీపీ వ్యతిరేకిస్తుందా లేక ఇదే పోరాట పటిమతో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుందా అనేది తేలాల్సి ఉంది.
వైసీపీ సభ్యుల మాటలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా పోరాటం చేస్తామన్నట్లుగా ఉంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పెంచిన అంచనాల ఆమోదం, నిధుల విడుదల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలపై గట్టిగా వైసీపీ పట్టుబడుతోంది. అయితే కేంద్రం నుండి వీటిపై ఇంత వరకూ స్పష్టమైన హామీలు మాత్రం రాలేదు. స్టీల్ ప్లాంట్ విషయాన్ని కేంద్రం తేల్చేసింది. నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తామని తేల్చి చెప్పేసింది. దీంతో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందన అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.