కృష్ణాజిల్లా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న గన్నవరంలో జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గన్నవరంలో సెక్షన్ 144 విధించడంతో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ చలో గన్నవరం పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. దేవినేని ఉమా, బుద్దా వెంకన్నను గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను అరెస్టు చేసి నాగాయలంక తరలించారు. గన్నవరంలో అరెస్టు చేసిన తెలుగు మహిళలను మచిలీపట్నంకు తరలించారు.
తన భర్త ఆచూకి ఇంత వరకూ తెలియలేదనీ, పోలీసులు సరైన సమాధానం చెప్పడం లేదని టీడీపీ నేత పట్టాభిరామ్ భర్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియజేయకపోతే డీజీపీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తానని చందన పేర్కొన్నారు. కాగా వైసీపీ నేతల ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. దొంతు చిన్నా, రాణి సహా మరో 30 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఐపీసీ 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 149, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభిరామ్ సహా మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. బోడే ప్రసాద్ తో పాటు మరో 11 మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
గన్నవరంలో నిన్న టీడీపీ, వైసీపీ నేతల నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి, జాతీయ రహదారిపై భైటాయింపులతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
Earthquake: టర్కీలో మరో సారి భారీ భూకంపం .. ముగ్గురు మృతి . 200 మందికి గాయాలు