YCP: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు ఈ నెల 1వ తేదీ నుండి న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుమలకు మహాపాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. తొలుత రైతుల పాదయాత్ర నిర్వహణకు డీజీపీ అనుమతి ఇవ్వకపోవడంతో అమరావతి జెఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. చివరకు హైకోర్టు అనుమతితో రైతులు పాదయాత్రను ఆరంభించారు. రైతుల పాదయాత్రకు బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఈ పాదయాత్ర రైతులు చేస్తున్న పాదయాత్ర కాదనీ, చంద్రబాబుకు అనుకూల రియల్ ఎస్టేట్ వాళ్లు నిర్వహిస్తున్న పాదయాత్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ నేతలు బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునేందుకు పాదయాత్రను ఉపయోగించుకుంటున్నారని ఇప్పటికే వైసీపీ నేత సజ్జల విమర్శించారు. టీడీపీ వెనక ఉండి ఈ పాదయాత్రను నడిపిస్తున్న నేపథ్యంలో అటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ సెంటిమెంట్ రాజేయ్యాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం..
Read More: YSRCP: వైసీపీ ఎవరి చెవిలో “కమ్మ”ని పూలు పెడుతున్నట్టు..!?
YCP: 22 నుండి ఉత్తరాంధ్రలో పాదయాత్ర
ఈ క్రమంలోనే విశాఖ పాలనా రాజధానికి మద్దతుగా ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన పాయకారావుపేటలో పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే గోళ్ల బాబూరావు వెల్లడించారు. విశాఖలో పరిపాలనా రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కొరుకుంటున్నారని పేర్కొన్న బాబూరావు .. రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరారు. 22న ప్రారంభమయ్యే పాదయాత్రలో వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ పాదయాత్ర 23న నక్కపల్లి, 24న ఎస్ రాయవరం, 25న కోటపురట్ల మండలాల్లో కొనసాగుతుందని తెలిపారు. ఉత్తరాంద్రలో పాదయాత్రకు సజ్జల స్ట్రాటజీయే అనే మాట వినబడుతోంది.
నాడు పోటీ దీక్షలు
ఏపిలో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో లాండ్ పూలింగ్ లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేపట్టారు. నిరసన ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో దీక్షలను నిర్వహించారు. ఒ పక్క మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా నిరసన దీక్షలు చేపట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు అమరావతి రైతులు మహాయాత్ర చేస్తున్న క్రమంలో ఉత్తరాంద్ర ప్రాంతంలో పాలనా రాజధానికి మద్దతుగా పోటీ పాదయాత్ర వైసీపీ ఆరంభిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.