రాజధానుల చట్టం పైన అఫిడవిట్ దాఖలు
ప్రత్యేక హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు
ఏపీలో మూడు రాజదానులు..సీఆర్డీఏ చట్టం రద్దు పై జరుగుతున్న న్యాయ పోరాటంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం చేసిన చట్లాలపైన హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలను..అమల్లోకి తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ల పైన ఈ నెల 14లోగా ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం కోర్టులో దాఖలైన పిటీషన్లకు సమాధానంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం అఫిడవిట్ లో చెప్పిన విషయాన్ని మరో సారి స్పష్టం చేసింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న రాజధాని..ప్రాజెక్టులను సమీక్షించే అధికారం సైతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని నివేదించింది. పిటీషనర్లు చట్టాల అమలు కాకుండా అడ్డుకొనేందుకు దాఖలు చేసిన పిటీషన్లు విచారణకు అర్హత లేనివిగా పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్ర విభజన చట్టం గురించి..ప్రత్యే హోదా గురించి ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు న్యాయ పరంగానే కాదు.. రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారాయి. కేంద్రం సైతం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వాదన మొదలైంది.
హైకోర్టులో ఏపీ అఫిడవిట్ దాఖలు
అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టం రద్దు పైన దాఖలైన పిటీషన్లకు సమాధానంగా ఏపి ప్రభుత్వం హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. అందులో ఇప్పటికే కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాజధాని పైన నిర్ణయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం అంటూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ లో పేర్కొంది. రెండు చట్టాల కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లలో చేస్తున్న వాదన అర్దరహితమని నివేదించింది. రాష్ట్రంలో రాజధానితో సహా ప్రాజెక్టులు..డెవలప్ మెంట్ యాక్టివిటీ వంటి అంశాలలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసు కునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొందరు ప్రతిపక్ష నేతలు..పిటీషనర్లు రాజధానుల వ్యవహారం పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంతో సంబంధం ఉందని..పునర్విభజన చట్టంలో సవరణలు లేకుండా రాజధానుల నిర్ణయం తీసుకొనే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదనే వాదన వారంతా బలంగా వినిపించారు. దీంతో..ఈ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అంశం పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. దీని ద్వారా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
విభజన చట్టం ..హోదా అంశాల ప్రస్తావన
ఏపీ పునర్విభజన చట్టం తో ఏపీ రాజధాని అంశం ముడి పడి ఉందనే దానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేందుకు కొన్ని అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టంలో అన్ని అంశాలు అమలు కాలేదని చెప్పుకొచ్చింది. పార్లమెంట్ లో చెప్పిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పునర్విభజన చట్టం పూర్తిగా అమలు అయినట్లుగా భావించాల్సి ఉంటుందని..ఇదే అంశం పైన తాము ప్రతీ సందర్బంలోనూ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొనట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే, ఇప్పటికే కేంద్రం..బీజేపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని..అది సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. అయినా..ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధానుల పైన జరుగుతున్న న్యాయ వివాదంలో ఈ అంశాన్ని ప్రస్తావించటం తో ఇది న్యాయ పరంగానే కాకుండా..రాజకీయంగానూ చర్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా తాము హోదా గురించి ప్రస్తావించటం లేదనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా వైసీపీ చెప్పుకొనే వెసులుబాటు ఏర్పడింది. కేంద్రం హోదా విషయంలో అన్యాయం చేసిందనే అంశాన్ని తాము కోర్టులోనూ ఫైట్ చేస్తేన్నామనే అంశం వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, ప్రభుత్వం ఇప్పుడు హోదా అంశాన్ని ప్రస్తావించటం ద్వారా ఈ రాజధానుల వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠ రాజకీయంగా నెలకొని ఉంది.