కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, యాపిల్ పళ్ళ కోత సీజన్కి ముందు కశ్మీర్ లోని యాపిల్ తోటల యజమానులు రాలిపోయిన యాపిల్ పళ్ళని ఎండబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకముందు ఇవే యాపిల్ పళ్ళు రాష్ట్రం బయట మార్కెట్లో పెట్టె 300-400 రూపాయలకు అమ్ముడయ్యేవి.
రాజ్యాంగంలోని 370 అధికరణని నీరు కార్చాక ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాపిల్ మార్కెట్ జోక్యం పధకానికి కూడా లోయలో పెద్దగా స్పందన లభించలేదు.
దక్షిణ కశ్మీర్లో చాలా మంది ఈ “నిరర్ధకమైన”, అధిక సమయం వెచ్చించాల్సిన పనిలో నిమగ్నమై ఉన్నారు. యాపిల్ పళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని ఆరుబయట ఎండలో ఆరబెడుతున్నారు.
ఇలా పళ్ళని ఎండబెట్టడం నిరర్ధకం అని నిపుణులు చెబుతున్నారు. దానికి బయట మార్కెట్లో ఎటువంటి విలువా లేదని, రాబోయే చలికాలంలో పశువులకి మేతగా పెట్టడానికి మాత్రమే ఇవి పనికివస్తాయని అంటున్నారు.
తమ సగం పంట పండిపోయి, చెట్ల నుండి రాలిపోవటంతో ఇలా ఎండు యాపిల్ ముక్కలు చేసే ఆలోచనలో ఉన్నామని ది వైర్ తో మాట్లాడుతూ యాపిల్ తోటల యజమానులు తెలిపారు. చెట్టు నుంచి యాపిల్ పండు రాలకూడదు. అలాంటి పళ్ళకి మార్కెట్లో విలువ బాగా తగ్గిపోతుంది. రాలిపోయిన పండు విలువ పావు వంతుకి పడిపోతుంది.
“విలువైన మా పంట ఇలా తోటల్లో కుళ్ళిపోవటం మాకు ఇష్టం లేదు. ఈ రాలిపోయిన పళ్ళ నుండి కనీసం పశువులకి అవసరమైన మేత తయారు చేసే పనిలో ఉన్నాము.” అని షోపియన్ లో చిత్రగం గ్రామానికి చెందిన గులాం మొహమ్మద్ భట్ తెలిపారు. సుమారుగా 1500 కుటుంబాలు నివసిస్తున్న తన గ్రామంలో చాలా మంది యాపిల్ తోటల మీదే ఆధాపడి తమ జీవనోపాధి పొందుతున్నారు అని కూడా చెప్పారు. తన అంచనాల ప్రకారం ఈ గ్రామం ప్రతి సంవత్సరం పన్నెండు లక్షల యాపిల్ బాక్సులని పండిస్తుంది అని, అందులో సగం ఇప్పుడు పండిపోయి చెట్ల నుండి రాలిపోతున్నాయి అని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రారంభించిన జోక్యం పధకంలో ఒక ప్రణాళిక అంటూ లేదని యాపిల్ తోటల యజమానులు, వర్తకులు చెబుతున్నారు. ఈ పధకం ప్రకారం తోట యజమానుల నుండి నాణ్యత పరీక్షలు చేసి, గ్రేడింగ్ చేసి యాపిల్ పళ్ళని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
అయితే యాపిల్, ఇతర పళ్ళు సరఫరా చేయాలన్న షరతుపై బయట మార్కెట్ల వ్యాపారులు తమకు రుణం ఇచ్చారనీ, అప్పిచ్చిన వర్తకులని కాదని ప్రభుత్వానికి తాము అమ్మలేమని తోట యజమానులు, స్థానిక వర్తకులు చెబుతున్నారు.“ ఎప్పుడో సంవత్సరం క్రితం యాపిల్ పళ్ళ కోసం డబ్బులు ఇచ్చిన వర్తకులకి మేము తిరిగి ఏమి కడతాం? వారికి పళ్ళ రూపంలో మేము తప్పక తిరిగి కట్టాలి.” అని యాపిల్ పళ్ళ వర్తకుడు మునీర్ హుస్సేన్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 370, 35A అధికరణలని నీరు కార్చాక కశ్మీర్లో జన జీవనం స్తంభించింది. మిలిటెంట్ కార్యకలాపాలకూ, అలజడులకూ కేంద్ర బిందువు అయిన దక్షిణ కశ్మీర్ చాలా వరకు యాపిల్ తోటల మీదే ఆధారపడి ఉంది. సమాచార వ్యవస్థ, ఇతర సదుపాయాలు పూర్తిగా తొలగించటంతో ఈ ప్రాంతం మళ్ళీ కుదేలయింది.
“ “సాధారణ పరిస్థితులు” తిరిగి వచ్చే అవకాశాలు ఇక లేవని మాకు బాగా తెలుసు. యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మేము మా పళ్ళని వూరికే వదిలెయ్యదలుచుకోలేదు. ఇలా యాపిల్ ముక్కలని ఎండబెట్టడం నిరర్ధకం అని మాకూ తెలుసు. అయితే మా ఖర్మ కాలి యుద్ధం మొదలయ్యింది అంటే రాబోయే చలికాలంలో కనీసం తినడానికి అయినా ఎదో ఒకటి ఉంటుంది.” అని స్థానికుడైన షౌకత్ అహ్మద్ షా తెలిపారు.
సెప్టెంబర్ చివరి నాటికి పళ్ళ కోతలు ఉధృతంగా సాగుతుంటాయి.. అయితే భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా ఉండటంతో యాపిల్ పళ్ళని ఏరే పనిని ఆపేసినట్టు ది వైర్ తో మాట్లాడుతూ దక్షిణ కశ్మీర్ లోని అనేక చోట్ల ఎక్కువమంది యాపిల్ తోటల యజమానులు తెలిపారు.
తమకి ప్రత్యేక హక్కులని దాఖలు పరిచే రాజ్యాంగంలోని 370, 35A అధికరణలని నీరు కారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ మార్కెట్లకి తమ యాపిల్ పళ్ళని పంపకపోవటం ద్వారా తమ నిరసనని వ్యక్తం చేస్తున్నామని కొంత మంది తోట యజమానులు తెలిపారు.
మరి కొంతమందేమో దక్షిణ కశ్మీర్లో జనసమ్మర్ధ ప్రాంతాలలో అడుగడుగునా వెలిసిన పోస్టర్లలో పేర్కొన్న సూచనలకి అనుగుణంగా చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ముద్ర ఉన్న ఈ పోస్టర్లలో తోటల యజమానులు యాపిల్ పళ్ళు ఏరవద్దని సూచించారు. ప్రజలు యాపిల్ పళ్ళు భారతదేశంలోని మార్కెట్లకి పంపవద్దని ఆ పోస్టర్లలో సూచించారు.
షోపియాన్, పుల్వామా జిల్లాలలో వివిధ ప్రాంతాలలో రాత్రి సమయంలో యాపిల్ బాక్సులు తగలబెట్టారు అని, గుర్తు తెలియని వ్యక్తులు యాపిల్ చెట్లని నరికేసారని స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల యాపిల్ పళ్ళని తీసుకువెళుతున్న వాహనాలపై దాడులు కూడా జరిగాయి.
“ ఈ సంవత్సరం కశ్మీర్ లో ఇరవై మూడు లక్షల టన్నుల యాపిల్ దిగుబడి వచ్చింది. వాటిని ఎండబెట్టే బదులు రైతులు వాటిని జలంధర్లో ఉన్న పళ్ళ రసం పరిశ్రమలకి పంపించి సంతృప్తికరమైన ధరలు పొందాలి.” అని కశ్మీర్ హార్టికల్చర్ డైరక్టర్ అజాజ్ అహ్మద్ భట్ ది వైర్ తో మాట్లాడుతూ పేర్కొన్నారు.
కశ్మీర్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే కశ్మీర్ హార్టికల్చర్ రంగానికి రెండు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది అని అల్ జజీరా అంచనా వేసింది.
కశ్మీర్ ఆర్ధిక వ్యవస్థ హార్టికల్చర్ రంగం మీద భారీగా ఆధారపడి ఉంది. రాజ్యాంగంలోని 370 అధికరణ నీరు కార్చాక చోటు చేసుకుంటున్న పర్యవసానాలు ఇలాగే కొనసాగితే ఈ రంగం తీవ్ర నష్టాలు చవి చూడాల్సివస్తుంది. హార్టికల్చర్ శాఖ వారి లెక్కల ప్రకారం ఈ సంవత్సరం కొన్ని చోట్ల వేసవి కాలంలో వడగళ్ళ వాన వల్ల జరిగిన నష్టం మినహాయించి కశ్మీర్ లో యాపిల్ పళ్ళ దిగుబడి అద్భుతంగా ఉంది.
పుల్వామా దాడి తరువాత జాతీయ రహదారుల మీద ప్రయాణం నిషేధించటంతో అప్పుడు కూడా యాపిల్ తోటల యజమానులు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దానితో పాటు, దుర్భర వాతావరణ పరిస్థితులు కారణంగా మంచు గడ్డలు, కొండ చరియలు విరిగి పడటంతో జమ్మూ—కశ్మీర్ రహదారిని మూసివేశారు. ఆ కారణంగా కూడా యాపిల్ పళ్ళ తోటల యజమానులు తీవ్ర నష్టాలు చవి చూశారు.
రహదారి మూసివెయ్యడంతో లోయలోని యాపిల్ తోటల యజమానులకు కలిగిన నష్టం 1200 కోట్లు. గతంలో లాగే ఈ సారి కూడా ప్రభుత్వం డిమాండ్-సరఫరా మధ్య సమతుల్యతను పాటించటంలో విఫలం అవ్వటంతో కశ్మీరీ యాపిల్ పళ్ళకి మార్కెట్లో విలువ పడిపోయింది అని నిపుణుల అభిప్రాయం.
దక్షిణ కశ్మీర్లో పని చేస్తున్న రెవెన్యూ శాఖలోని ఒక ఉన్నతాధికారి ప్రకారం హార్టికల్చర్ రంగానికి సంబంధించే ఏడు వందల గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. “ఎండబెట్టిన పళ్ళకి ఏ మాత్రమైనా విలువ ఉంటుంది అని నేను అనుకోవటం లేదు. వాళ్ళు ఇలా చేస్తున్నారంటే నాకు మతి పోతున్నది. వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు ఇలా చేస్తుంటే ఇక చెప్పేది లేదు” అని ఆయన అన్నారు.
కశ్మీర్ లో శీతల గిడ్డంగుల సంఖ్య చాలా తక్కువ. ఉన్నవాటి సామర్ధ్యం కూడా కేవలం లక్ష టన్నులే. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే శీతల గిడ్డంగే లేదు లోయలో. దానితో పరిస్థితులు మెరుగుపడేవరకు తమ ఉత్పత్తిని నిల్వ చేసుకునే అవకాశమే లేదు రైతులకి.
పుల్వామా, షోపియాన్, కుల్గాం జిల్లాలలో కోయిల్, మోలు-చిత్రగం, బాబాపోరా, అరిహళ్, హేఫ్ఫ్, జైన్పోరా,రాజ్పోరా లాంటి ప్రాంతాలలో 30% కులూ-డెలిషియస్ రకం యాపిల్ పళ్ళు పండిపోయి రాలిపోయాయి. కొంతమంది యజమానులు రాలిపోయిన పళ్ళని ఎండబెట్టగా, ఇతరులు వాటిని తోటలో అలాగే వదిలేసారు.
సాధారణంగా, వాటి ఔషధ గుణాల కారణంగా ఎండబెట్టడానికి దశాబ్దాలుగా కశ్మీర్ లో పెంచుతున్న యాపిల్ రకాలు రెండే రెండు- అవి మహారాజి రకం, బం-క్సోంట్ రకం. ఈ రెండు రకాలని అంత భారీ స్థాయిలో ఏమీ పెంచరు. కాబట్టి తోట యజమనులకి ఇవి పెద్దగా లాభాలు చేకూర్చేవి కాదు. అందువలన కశ్మీర్ హార్టికల్చర్ రంగాన్ని సంక్షోభం నుండి ఇప్పుడు ఇవి బయటపడేయవు.
2017 ఆర్ధిక సర్వే ప్రకారం లోయలో 3.4 లక్షల హెక్టార్ల భూమిలో పళ్ళ తోటలు వేయగా, అందులో 48% శాతం యాపిల్ తోటలే. ఇది సుమారుగా ముప్పై నాలుగు లక్షల మందికి లేదా ఏడు లక్షల కుటుంబాలకి ప్రాధమిక జీవనోపాధి వనరు.
గత సంవత్సరం పంతొమ్మిది లక్షల టన్నులు యాపిల్ ఉత్పత్తి కాగా అందులో కేవలం లక్ష టన్నులు శీతల గిడ్డంగులలో నిల్వ చేసారని ది వైర్ తో మాట్లాడుతూ కశ్మీర్ హార్టికల్చర్ శాఖ డైరక్టర్ అజాజ్ అహ్మద్ భట్ తెలిపారు.
రషీద్ హసన్
వ్యాసకర్త దక్షణ కాశ్మీర్లో ఉండే జర్నలిస్టు
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో