మంత్రుల పనిని ప్రతిపక్ష ఎంపీ చేసేసారు..
రాజకీయ ఎత్తుగడా.. వ్యక్తగత ప్రచారం కోసమా..
కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్ సత్సంబంధాలు కోరుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధానికి ప్రధానితో పాటుగా కేంద్ర ప్రముఖులను ఆహ్వానించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అయితే, బెజవాడ ఎంపీ ఇప్పుడు ఏపీ సీఎం..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మధ్య కొత్త ఫిట్టింగ్ పెట్టారు. వాస్తవంగా అధికార పార్టీ నేతలు అధికారికంగా చేయాల్సిన పనిని..ప్రతిపక్ష ఎంపీ చేసేయటం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా శంకుస్థాపన..ప్రారంభ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి లేదా మంత్రులు వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించటం ఆన వాయితీ. అయితే, అదేమీ లేకుండా ప్రభుత్వం నుండి ఎవరూ ప్రతినిధులు లేకుండానే..ఇంకా ముహూర్తం సైతం ఖరారు కాని కార్యక్రమానికి ప్రతిపక్ష ఎంపీ వెళ్లి నేరుగా కేంద్ర మంత్రిని ఆహ్వానించేసారు. ఇది.. ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా చేసారా..అధికార పక్షానికి రాజకీయంగా వేసిన ఎత్తుగడా..ఎంపీగా తన వ్యక్తిగత ప్రచారం కోసమా..ఎందుకు ఇలా చేసారు..అసలు ఏం జరిగింది…
కేంద్ర మంత్రికి కేశినేని ఆహ్వానం..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ … పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ 2015 డిసెంబర్ 5వతేదీన శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన ఈ ఫ్లై ఓవర్ అప్పట్లో టీడీపీ నేతగా..ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు కు చెందిన కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కింది. విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. అయితే, ఏడాది లోగానే ఈ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పినా..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో నుండి దిగి పోమే సమయానికి కూడా పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 14 నెలల్లో తామే ఈ పనులను పూర్తి చేసామని అధికార పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు అది పూర్తయి..ట్రయిల్ రన్ జరుగుతోంది. ఇదే సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశమయ్యారు. కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు.ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ పనుల పూర్తి వివరాలను తెలిపారు.గడ్కరీ చూపిన శ్రద్ధ వల్లనే ఈ రోజు ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు వచ్చాయని, విజయవాడ అభివృద్ధికి మరింత సాయం చేయాలని కోరారు.
అధికార పార్టీకి తెలియకుండానే ఆహ్వానమా..!!
ఈ ఫ్లై ఓవర్ పనులు పూర్తికావటంతో త్వరలోనే అధికారికంగా ప్రారంభించటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంతలోనే విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానించటం పైన హాట్ డిస్కషన్ మొదలైంది. అసలు అధికార పార్టీ నుండి సీఎం లేదా మంత్రులు వెళ్లి కేంద్ర మంత్రిని ప్రారంభోత్సవ ముహూర్తం చెప్పి అధికారికంగా ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ప్రారంభ ముహూూర్తం కూడా ఖరారు కాలేదు. ఇంతలోనే కేంద్ర మంత్రిని ఎంపీ ఆహ్వానించటం ఏంటనేది అధికార పార్టీ నేతల ప్రశ్న. అయితే, నానికి వ్యక్తిగతంగా నితిన్ గడ్కరీతో ఉన్న సంబంధాల కారణంగా.. పనులు పూర్తి చేయించిన ఘనత సైతం కేంద్ర మంత్రికే దక్కేలా ఆయన అక్కడ ప్రతిపక్ష పార్టీ ఎంపీగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్లైఓవర్ పనులు పూర్తయినా..ఆ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వాని కి కాకుండా..కేంద్రానికి ఇవ్వటమే నాని లక్ష్యంగా కనిపిస్తోంది. గడ్కరీ చూపిన శ్రద్ధ వల్లనే ఈ రోజు ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు వచ్చాయని చెప్పటం వైసీపీ పెద్దలకు రుచించటం లేదు. ఇందులో కేంద్ర భాగ స్వామ్యం ఉన్నా టీడీపీ ప్రభుత్వ హాయంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో..ఇప్పుడు కేంద్రానికి ఫ్లై ఓవర్ నిర్మాణ క్రెడిట్ ఇవ్వాలని టీడీపీ ఎంపీ ప్రయత్నిస్తున్న సమయంలో..అసలు ఈ ప్రారంభోత్సవానికి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్ర భాగస్వామ్యం సైతం ఉండటంతో ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రిని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. బెజవాడలో ఎన్నో దశాబ్దాలుగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఈ ఫ్లై ఓవర్ పరిష్కారం చూపుతుందని..దీని ద్వారా తమ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని భావిస్తున్న విజయవాడ వైసీపీ నేతలు ఇప్పుడు ఎంపీ నాని వ్యవహారం పైన ఎలా స్పందిస్తారో చూడాలి.