ఈనెల 19వ తేదీన మరో బెంచ్ లో విచారణ..
ఏపీలో న్యాయ పోరాటంగా మారిన రాజధాని వికేంద్రీకరణ కేసుల్లో సుప్రీంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం..చట్టాలుగా మారటంతో దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి..రైతులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు తొలుత ఈ నెట 14వ తేదీ వరకు స్టేటస్ కో అంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకూ రాజధానుల విషయంలో ముందుకు వెళ్లవద్దని చెబుతూ..కౌంటర్ అఫిడవిల్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో…ఈ నెల 13న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అందులో రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉందని..ఇదే విషయాన్ని కేంద్రం సైతం తమ అఫిడవిట్ లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. అయితే, ఈ నెల 14న మరోసారి విచారించిన హైకోర్టు అదే విధంగా స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీని పైన ఈ రోజు సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
రాజధాని రైతుల తరపున వాదిస్తున్న సీజే బంధువులు
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు వచ్చింది. ఆ సమయంలో ఇదే కేసులో వాదిస్తున్న రంజిత్ కుమార్ సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు ఒక విషయాన్ని ప్రస్తావించారు. అమరావతి రాజధాని రైతులు దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోందని..హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ..రాజధాని రైతుల తరపున సుప్రీం చీఫ్ జస్టిస్ బంధువులే న్యాయస్థానాల్లో వాదిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో..ఈ కేసు విచారణ నుండి తాను తప్పుకుంటున్నానని..నాట్ బిఫోర్ మీ అంటూ ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని సుప్రీం చీఫ్ జస్టిస్ ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఈ కేసును ఈ నెల 19వ తేదీన విచారణకు వాయిదా వేసారు. ఆ విచారణలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు విచారించనుంది.