YSRCP: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీసెంట్ గా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం తాడేపల్లికి వచ్చిన పొంగులేటి.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి ఉన్నప్పటికీ అంత యాక్టివ్ గా లేరు. ఇంతకు ముందు వైఎస్ఆర్ సీపీ ఖమ్మం ఎంపీగా పొంగులేటి గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సమయంలోనూ పొంగులేటి క్రియాశీలకంగా పని చేశారు. త్వరలో ఏపిలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో పొంగులేటి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
YSRCP: జూన్ లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు
ఈ ఏడాది జూన్ మాసంలో ఏపి నుండి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తో పాటు బీజేపీ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీ కాలం ముగియనుంది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు టీడీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైనా ఆ తరువాత బీజేపీలో విలీనం కావడంతో బీజేపీ సభ్యులుగానే పదవీ విరమణ చేస్తున్నారు. నాడు ఎన్డీఏ మిత్ర పక్షంగా ఉన్న కారణంగా బీజేపీ పెద్దల విజ్ఞప్తి మేరకు సురేష్ ప్రభును టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక చేశారు. సురేష్ ప్రభును రెన్యువల్ చేయాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ను కోరతారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
YSRCP: విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా..?
పలువురు నేతలకు గతంలో సీఎం వైఎస్ జగన్ రాజ్యసభ సీటు హామీ ఇచ్చి ఉన్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో జగన్ ఎవరెవరికి అవకాశం ఇస్తారు..? అనేది వైసీపీలోనే పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జితో పాటు కేంద్రంలో ఏపి వ్యవహారాలు చూసే ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా..? లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే తను రాజ్యసభకు మరో సారి వెళ్లనని విజయసాయిరెడ్డే కొందరు పార్టీ నేతల వద్ద చెప్పినట్లు వార్తలు వినబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుండి విజయసాయి పోటీ చేయాలని భావిస్తున్నారనీ, అందుకే రెన్యువల్ గురించి అడగడం లేదని అంటున్నారు.
YSRCP: పొంగులేటి జగన్ ను కలిసింది రాజ్యసభ కోసమేనా..?
ఈ క్రమంలో విజయసాయి రెడ్డిని మరో సారి నామినేట్ చేయకపోతే ఆ అవకాశాన్ని తనకు కల్పించాలని పొంగులేటి జగన్ ను కోరినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. సీఎం జగన్ ఊ కొడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని అంటున్నారు. 2014లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ ఎంపిగా గెలిచిన పొంగులేటి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే కేసిఆర్ 2019 లో పొంగులేటిని కాదని టీడీపీ నుండి టీఆర్ఎస్ లో నామా నాగేశ్వరరావుకు ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన పొంగులేటి పార్టీ పై అసంతృప్తి, అసమ్మతిగా ఉంటున్నారని అంటున్నారు. ఈ తరుణంలో పొంగులేటి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ ను కలిసి వెల్లడంతో ఆయన రాజ్యసభ సీటు కోసమే వచ్చారని ప్రచారం జరుగుతోంది. రెడ్డి కోటాలో విజయసాయిరెడ్డికే రెన్యువల్ చేస్తారా..? లేక పొంగులేటికి జగన్ అవకాశం కల్పిస్తారా..? అనేది తెలియాలంటే కొద్ది నెలలు ఆగాల్సిందే.