ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసపట్టుకు చేరాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, పుంజుకునేందుకు కసరత్తు చేస్తున్న బీజేపీ, జనసేన ఇలా ఆయా పార్టీలు అంశాల వారీగా తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే చర్చకు తెరపడి ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. చాలాకాలంగా కసరత్తు జరిగి, వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఈ పదవిని ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన నేతకే కట్టబెట్టింది. ఈ క్రమంలోనే మొదటి నుంచి చర్చల్లో ఉన్న కాపు నేత సోము వీర్రాజుకు చాన్స్ దక్కింది. అయితే, ఈ ఎంపిక తదనంతర పరిణామాలు ఇప్పుడు చర్చకు కారణంగా మారుతున్నాయి.
గత ఏడాది జరిగిన ఎన్నికల ముందు సమయం వరకు వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగిన కన్నా లక్ష్మీనారాయణ అనూహ్య రీతిలో బీజేపీలో చేరారు. చేరిన కొద్ది రోజులకే అధ్యక్ష పదవిని అలంకరించి కన్నా లక్ష్మీనారాయణ ఈ క్రమంలో తన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనకు అనేక అడ్డంకులు, సమస్యలు ఎదురయ్యాయి. పార్టీలోని ఓ వర్గం ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం, క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడకపోవడం వంటివి కన్నా గ్రాఫ్ డౌన్ అయ్యేలా చేశాయి. దీంతో కన్నాను అధ్యక్ష పదవి నుంచి తొలగించి వీర్రాజును ఆ పదవికి ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కన్నా ఒకరకంగా పొలిటికల్ క్రాస్ రోడ్స్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రచారం జరిగినట్లు కన్నా వైసీపీలో చేరితే ఎన్నికల్లో గెలిచేవారు. దాదాపుగా మంత్రి పదవి దక్కించుకునే వారు. ఒకవేళ ఓడిపోయినా…ఆయనకు ప్రాధాన్యమైన పదవే దక్కేది. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లలేరు. టీడీపీ వైపు మొహం చూపని పరిస్థితి. సొంత గూడు అయిన కాంగ్రెస్ గురించి ఆలోచించడమే దండగ. ఇక ప్రస్తుతం ఉన్న పార్టీ అయిన బీజేపీలో ఇప్పటికే నాయకులతో సమన్వయ లోపం సహా అనేక అంశాలున్నాయి.
ఇలాంటి తరుణంలో కన్నా లక్ష్మీనారాయణ ముందున్న ఏకైక ఆప్షన్ బీజేపీ శ్రేణులకు చేరువ అవడం. పార్టీ భావజాలన్ని విస్తృతం చేస్తూనే ముఖ్యనేతగా ఎదిగేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేయడం. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, సత్తా చాటుకొని బీజేపీ పెద్దల మనసు గెలుచుకోవడం. తద్వారా అవకాశం దొరికితే ముఖ్య పదవులను కైవసం చేసుకోవడం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?