Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం భారత్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. దీంతో చాలామంది తెలుగు ప్రముఖులు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేశారు. “నిజమైన దర్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన టీవీకి భారతరత్న అవార్డు రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఇండియాను ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన వ్యక్తిని భారతరత్నతో సత్కరించారు. భారతీయులందరికీ ఇది నిజంగా ఇది సంతోషకరమైన విషయం అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. అటువంటి వ్యక్తికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ కీర్తి, ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కటం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గార్లకు భారతరత్న రావటం సంతోషకరమని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చాక భారత ఆర్థిక పరిస్థితి అంత ఏమాత్రం ఉండేది కాదు.
1988లోనే సంక్షోభం దిశగా భారత ఆర్థిక పరిస్థితి వెళుతుందని అప్పట్లో అంతర్జాతీయ నివేదికలు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని హెచ్చరించడం జరిగింది. దీన్ని నివారించాలంటే రుణాలు తీసుకోవాలని సలహా కూడా ఇవ్వటం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే అంతర్జాతీయ సంస్థ సూచనను రాజీవ్ గాంధీ అంగీకరించారు. అయితే ఆ సమయంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఇతర ప్రభుత్వాలు ఏర్పడటం వంటివి జరగడంతో అప్పటికే దేశం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. అలాంటి పరిస్థితులలో పీవీ నరసింహారావు ప్రధాని అయిన తరుణంలో తీసుకొచ్చిన మొట్టమొదటి బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చేయడం జరిగింది.