సోము వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ప్రతిపక్షం ఖాళీ
ఏపీకీ మూడు రాజధానులు అవసరమా..
ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఏపీలో బీజేపీ కూటమి అధికారంలో వస్తుందని ఆయన ఏపీ అధ్యక్షుడి తరహాలో పార్టీ నేతల్లో ధీమా కల్పించే ప్రయత్నం చేసారు. కానీ, అదే వేదిక పై నుండి పార్టీ జాతీయ నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో భిన్నాభిప్రాయాలకు వ్యక్తం అయింది. రాం మాధవ్ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావటం అంత సులభమైన విషయం కాదంటూ కీలక వ్యాఖ్య చేసారు. ఇది జగన్ బలం పైన ఉన్న అంచనాలతోనే ఈ వ్యాఖ్యలు చేసారనే చర్చ మొదలైంది. అదే సమయంలో టీడీపీ పైన పరోక్షంగా మండిపడ్డారు. అసలు ఏపీలో ప్రతిపక్షం లేదని..ఖాళీగా ఉందంటూనే బీజేపీ ఆ పాత్ర పోషించాలని సూచించారు. మూడు రాజధానుల పైనా రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనే ఒక్క రాజధాని ఉండగా..ఏపీకి మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. అయితే, అది రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. గతంలో ఒక్క రాజధాని విషయంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన బీజేపీ..మూడు రాష్ట్రాల పేరుతో జరిగే అవినీతిని ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు.
వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ఒకే వేదిక నుండి..
ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ సమిష్టి నాయకత్వంలో పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ నేత రాం మాధవ్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన అంతకు ముందు బీజేపీ ఏపీ నూతన చీఫ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని వీర్రాజు చెప్పుకొచ్చారు. కానీ, రాం మాధవ్ ఆ వ్యాఖ్యలతో విభేదించారు. ఏపీలో అధికారంలోకి రావటం అంత సులభమైన విషయం కాదని సభా వేదికగా తేల్చి చెప్పారు. 2024లో అధికారంలోకి వస్తామనేది స్లోగన్ గా మారకూడదని..తిరిగి 2024లో అధికారంలోకి రాకపోతే..తిరిగి 2029 లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమనేది అప్పుడు స్లోగన్ గా మిగులుతుందని చెప్పడంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. రాం మాధవ్ ఉన్నదే చెప్పారనేది కొందరు బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను సమర్ధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేవలం మాటలు చెప్పి చేతలకు దూరంగా ఉండకూడదనేది రాం మాధవ్ భావన అని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్షం లేదంటూ టీడీపీని రాజకీయంగా చాలా లైట్ గా తీసుకున్నట్లు వ్యాఖ్యలు చేసారు. అయితే, 2024లో అధికారం సాధ్యం కాదనే విషయాన్ని రాం మాధవ్ చెప్పకనే చెప్పారు. టీడీపీ ఉనికే లేదంటున్న రాం మాధవ్ ఏపీలో వైసీపీ బలంగా ఉందనే విషయం పరోక్షంగా అంగీకరించినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సమయంలో రాం మాధవ్ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఇబ్బంది కరంగా కనిపిస్తున్నాయి.
మూడు రాజధానుల పైనా ఇలా..
ఇక… రాం మాధవ్ ఏపీలో వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల అంశం పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఎక్కడా మూడు రాజధానుల కాన్సెప్ట్ లేదని..ఏపీలో మాత్రం దీనిని అమలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజధానుల విషయంలో కేంద్రం రాజ్యంగ బద్దంగా వ్యవహరించి..రాష్ట్ర పరిధిలోనిదని తేల్చి చెప్పందని గుర్తు చేసారు. ఏపీ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఒక్కటే రాజధాని ఉందని..ఏపీలో మాత్రం మూడు రాజధానులు చేస్తున్నారని తప్పు బట్టారు. యూపీలో ఒకటే రాజధానిగా ఉన్న లక్నో నుండి పాలన సాగటం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఒక్క రాజధాని ఏర్పాటులో జరిగిన అవినీతి పైన పోరాటం చేసామని..ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పోరాటాలు సాగించాలన్నారు. రాజధాని వ్యవహారం ప్రస్తుతం సబ్ జుడిస్ లో ఉందని..పార్టీ నేతలు ఆచి తూచి స్పందించాలని సూచించారు. మొత్తంగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానిని విశాఖ లో పరిపాలనా రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం..రాజకీయంగా బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ రాజధానుల విషయంలో చేసిన వ్యాఖ్యల పైన ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.