సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయ్యేది టీవీ 9. సోషల్ మీడియాలో జనం విపరీతంగా సెటైర్ లు వేసుకునేది టీవీ 9లోని కార్యక్రమాలు మీదనే. కానీ ఆ ఛానల్ కే అనూహ్యంగా టీఆర్పీ రేటింగ్స్ వస్తుంటాయి. ఇది ఇప్పటిది కాదు. గడిచిన దశాబ్దకాలంగా కూడా టీఆర్పీ రేటింగ్స్ లో టీవీ 9 నెంబర్ వన్ గానే కొనసాగుతూ ఉంది. టీవీ 9 కంటే మంచి వార్తలను, మంచి కథనాలను అందించే ఇంకొన్ని మీడియా ఛానళ్లకు టీవీ9 అంటే ఎప్పుడు రుస రుస. ఎన్టివీ, వీ 6, ఏబీఎన్, ఈ టీవీ2 ఛానల్స్ అన్నీ కూడా టీవీ 9 ఎటువంటి చీకటి దందా చేస్తోందో చెప్తూ ఉంటారే కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయలేదు. కానీ తాజాగా కరోనా లాక్ డౌన్ సమయంలో టీవీ ఛానల్ రేటింగ్స్ విషయంలో టీవీ 9 అనూహ్యంగా దూసుకుపోవడంతో ఏం జరుగుతుందో తేల్చాలంటూ కొన్ని ఛానల్ BARC (బార్క్) కు ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ చేసి టీవీ 9 సంగతి చూడకుంటే తాము బార్క్ నుంచి బయటకు వచేస్తామని హెచ్చరించాయి. దీనితో టీవీ 9 లోని చీకటి కోణం బయట పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు టీవీ ఛానల్ టీవీ 9 లో కార్యక్రమాల మీద ప్రత్యేకమైన ఫోకస్ అంటూ ఏమీ లేదు. v6 లో బిత్తిరి సత్తి ఉన్నంతకాలం తీన్మార్ ప్రోగ్రాం కి మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. ఎన్టీవీ లో స్టోరీ బోర్డ్ కు టిఆర్పి రేటింగ్స్ వస్తుంటాయి. అలాగే ఈ టీవీ లో రాత్రి 9 గంటలకు ప్రసారమైయ్యే న్యూస్ కు వస్తుంటాయి. ఇటీవల టీవీ 5లో మూర్తి చేస్తున్న లైవ్ షో కు కూడా టిఆర్పి రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. టీవీ 9 లో 30 మినిట్స్ అనే ప్రోగ్రాం తప్ప వేరే సాధారణ కార్యక్రమాలకు టిఆర్పీ రేటింగ్స్ పెద్దగా ఉండవు. ఇది సాధారణంగా జనాలకి తెలిసిన మాట. కానీ సాంకేతికంగా టిఆర్పి రేటింగ్ చూస్తే మాత్రం టీవీ 9 ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. ఇదే రహస్యం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ దశాబ్ద కాలంగా చూసీచూడనట్టు మిగిలిన తెలుగు ఛానల్ అన్ని ఉన్నాయి. టీవీ9 కేబుల్ నెట్వర్క్ మేనేజ్ చేస్తోందని టిఆర్పి రేటింగ్స్ ను కొలిచే యంత్రాన్ని మేనేజ్ చేసుకుంటూ అక్కడి సిబ్బందికి వాటాలు ఇచ్చుకుంటూ టిఆర్పి రేటింగ్స్ పెంచుకుని చీకటి ఆదాయం పొందుతుందని ఏవో రకరకాల ఆరోపణలు వుండేవి. ఇవన్నీ దశాబ్దకాలంలో ఏనాడు పట్టించుకోలేదు. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో అన్ని ఛానల్స్ కు ఆదాయం తగ్గడంతో ఇప్పుడు టిఆర్పి రేటింగ్స్ ఆధారంగానే యాడ్ ల ఆదాయం వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో టీఆర్పీ రేటింగ్స్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.
తెలుగులో న్యూస్ ఛానల్ విషయాన్ని పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ ఛానల్ విషయానికొస్తే స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ ఛానల్ మధ్య మంచి పోటీ ఉంటుంది. ఈ టీవీల్లో వచ్చే సీరియల్ లో కొన్ని ప్రజాదరణ పొందిన కొన్ని వినోదాత్మకమైన సినిమాలు హిట్ సినిమాలు ప్రసారం చేసినా సరే సీరియల్ ముందు బోల్తా కొడుతుంటాయి. కార్తీకదీపం తెలుగు సీరియల్ ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్ లో టాప్ లో ఉంది. గడచిన నాలుగు నెలల కాలంలో కరోనా లాక్ డౌన్ రావడం తో ఈ చానళ్లకు యాడ్ ల ద్వారానే వచ్చే ఆదాయం 70 శాతం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని చానళ్లకు టీ ఆర్ పీ రేటింగ్స్ కీలకం అయ్యాయి. దీనితో ఇన్నాళ్ళు టీ ఆర్ పీ రేటింగ్స్ ను పెద్దగా పట్టించుకోకుండా స్వతహాగా సొంత ఇమేజ్ తో నెట్టుకొచ్చిన చానళ్ళు ఇప్పుడు టీ ఆర్ పీ ఆధారంగా చీకటి కోణాలను బయట పెట్టుకుంటూ నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నాయి.