YS Jagan: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రత్యర్ధి పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అన్నీ అగిపోతాయని అందుకని పథకాల లబ్దిదారులు అందరూ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని ప్రజలకు వివరించాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కోరారు.
దెందులూరు శనివారం సిద్దం పేరుతో ఏర్పాటు చేసిన క్యాడర్ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్దమా అని ప్రశ్నించారు. ఎల్లో వైరస్ మీద, కరోనా లాంటి దుష్ట చతుష్టయం మీద యుద్దానికి సిద్దమా అని ప్రశ్నించారు.
తోడేళ్ల వైపు నుండి చూసినప్పుడు జగన్ ఒంటరివాడిగానే కనిపిస్తాడని అన్నారు. తాను ఏనాడూ ఒంటరిని కాదని జనం అంతా తోడుగా ఉన్నారన్నారు. రామాయణం, మహాభారతంలో విలన్లు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారని అన్నారు. తన ఆలోచనలు అన్నీ ప్రతి ఇంటికి వెళ్లి క్యాడర్ పంచుకోవాలని కోరారు. దిగజారుడు పార్టీలు అన్నీ జగన్ నే టార్గెట్ చేస్తున్నాయని అన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏనాడైనా పది శాతం అమలు చేశాడా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేశాడా ప్రతి ఇంటికి వెళ్లి అడగాలన్నారు. గత 56 నెలల పాలనలో కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ జరిగిన అభివృద్ధి చూడమని చెప్పండి అంటూ క్యాడర్ కు జగన్ పిలుపు నిచ్చారు.
లంచాలు, వివక్ష లేని పారదర్శకతతో కూడిన పాలన తీసుకువచ్చామన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చీల్చి చెండాడాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ 57 నెలల పాలనలో రెండున్నర లక్షల కోట్లను అందించామని అన్నారు. చంద్రబాబు రా కదలిరా అంటూ దత్తపుత్రుడిని, బీజేపీలో ఉన్న వదినమ్మను, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, వైఎస్ఆర్ పై కేసు నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీని పిలుస్తున్నారని విమర్శించారు.
మనతో పోరాటం చేసే వారు అందరూ ఈ రాష్ట్రంలో ఉండే వారు కాదనీ, నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లని, పక్క రాష్ట్రం నుండి వచ్చి వెళుతూ ఉంటారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తుందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది అన్నారు. వచ్చే ఎన్నికల రణ క్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని అని అన్నారు. సభకు లక్షలాదిగా వైసీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. దెందులూరు సభా ప్రాంగణం జనసంద్రమైంది.
Panjab: పంజాబ్ గవర్నర్ పురోహిత్ రాజీనామా .. ఎందుకంటే..?