(న్యూస్ అర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: అవినీతి కేసుల్లో కోర్టు విచారణకు వ్కక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి వీలు లేదంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ కేసుల్లో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అనంతరం ఈ కేసు విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.
వైఎస్ జగన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగిన సందర్భంలో అయనకు మినహాయింపు లేకుండా ఆదేశాలివ్వాలని సీబీఐ అభ్యర్దించింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వడానికి సిబిఐ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసుల్లో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును వ్యతిరేకిస్తూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొదని సీబీఐ కోరింది. జగన్కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పై ఏప్రిల్ 9న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.