(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ నిర్ణయం అమలు విషయంలో అనిచ్ఛితి కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్ ఎంఎ షరీప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన మండలి కార్యదర్శి ముందు మరొక దారి లేదు. వైసిపి ప్రభుత్వ పెద్దల వత్తిడిని కాదని ఆయన ఛైర్మన్ ఆదేశానుసారం నడిచే అవకాశం లేదు.
సాంకేతిక కారణాల వల్ల బిల్లులును సెలక్ట్ కమిటీకి పంపలేమంటూ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులు పైలును వెనక్కు పంపిన మీదట మూడు రాజధానుల బిల్లులు రెండూ ఉభయ సభల ఆమోదం పొందినట్లేనని వైసిపి మంత్రి పిల్లి సుభాష్చంద్ర బోస్, మండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అంటున్నారు. కార్యదర్శిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వక తప్పదని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు.
ఏ చట్ట సభ అయినా దాని స్పీకర్ లేక ఛైర్మన్కు విశేష అధికారాలు ఉంటాయని అందరికీ తెలుసు. సభ కార్యకలాపాల వరకూ సభాపతిదే ఆఖరు మాట. సభాపతి నిర్ణయాలు న్యాయసమీక్షకు వెళ్లవచ్చు. అలా వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తన నిర్ణయాన్ని ధిక్కరించినందుకు మండలి ఛైర్మన్ కార్యదర్శిపై చర్య తీసుకోవచ్చు. అయితే కార్యదర్శి దానికి కూడా తలొగ్గకపోవచ్చు. అప్పుడు కార్యదర్శిని అరెస్టు చేసి తీసుకురావాల్సిందిగా ఛైర్మన్ పోలీసు అధికారులను ఆదేశించవచ్చు. అలాంటి సందర్భంలో పోలీసు అధికారులు ఛైర్మన్ మాట వినకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు ఛైర్మన్ న్యాయస్థానాన్ని ఆశ్రయిచాల్సివస్తుంది. ఇది రాజ్యాంగ సంక్షోభం కిందకే వస్తుంది. భారత రాజ్యాంగం పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలను మూడు వేరువేరు అంగాలుగా రూపొందించింది. వీటిలో న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థలు సర్వ స్వతంత్ర వ్యవస్థలు. ఒకదాని పరిధిలో మరొకటి వేలు పెట్టడం అరుదు. అలాంటిది తన అధికారాన్ని కాపాడాల్సిందిగా ఒక చట్టసభ అధ్యక్షుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అన్నది ఊహాతీతం. భారతదేశంలో ఇలాంటి ఉదంతం ఎప్పుడూ జరగలేదు.
వైసిపి ప్రభుత్వం ఈ లోపే మరో విధంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. పిల్లి సుభాష్చంద్ర బోస్, ఉమ్మారెడ్డి అన్న మాటల ప్రకారం రెండు బిల్లులూ ఉభయ సభల ఆమోదం పొందాయంటూ వాటిని గవర్నర్కు పంపవచ్చు. అప్పుడు మండలిలో మెజారిటీ పక్షమైన టిడిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. ఈలోపు బంతి గవర్నర్ కోర్టులో ఉంటుంది కాబట్టి ఆయన ఆఘమేఘాలపై నిర్ణయం తీసుకోవచ్చు. గవర్నర్ను నియమించింది బిజెపి కాబట్టి ఆయన ఆ పార్టీ సూచన ప్రకారం నడుచుకుంటారు. బిజెపి నాయకత్వం వైసిపి అనుకూల వైఖరి తీసుకుంటే అప్పుడు కూడా వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. మొత్తం మీద బిల్లుల విషయంలో పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నవైసిపి పట్టుదల కారణంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తే సూచనలు మెండుగా కానవస్తున్నాయి.