Chandrababu: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైసీపీ కుట్రలు చేస్తొందని అన్నారు.
హత్యాయత్నం అంటూ టీడీపీ పై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రయత్నాలను ప్రజలు చీత్కరిస్తున్నారని అన్నారు. జగన్ పై రాయి దాడి ఘటనపై నాలుగు రోజులైనా పోలీసులు ప్రకటన చేయలేదన్నారు.
నిందితులంటూ వడ్డెర కాలనీ యువకులను పోలీసులు తీసుకువెళ్లారన్నారని దీంతో ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. టీడీపీ నేతల ప్రోద్భలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తొందని అన్నారు.
బొండా ఉమా ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని యత్నిస్తున్నారని అన్నారు. అలా జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని శిక్షిస్తామని అన్నారు. కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదని అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగవద్దని చంద్రబాబు సూచించారు.
అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యతల నుండి తప్పించాలన్నారు. ఈసీ పర్యవేక్షణలో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్